ముథోల్, జూలై 16 : రైతుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బిద్రెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బోరిగాంలో రూ.66లక్షలు, చింతకుంటలో రూ.36లక్షలు, కారేగాంలో రూ.35లక్షలతో విత్తనాలు, ఎరువుల నిల్వల కోసం నిర్మించిన గోదాంలను ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరింత చేరువగా ఉండేందుకే గోదాంల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత కరెంట్, రైతు బీమా, రైతుబంధుతో రైతులకు సహకారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే పథకాలు అమలవుతాయన్నారు. గోదాం నిర్మాణాలకు స్థలాన్ని ఇచ్చిన దాతలను అభినందించారు. గ్రామాల్లోనే రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పంచాయతీ నిర్మాణానికి భూమిపూజ
చింతకుంట గ్రామంలో రూ.20లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమిపూజ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్బాబు, జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, చింతకుంట సర్పంచ్ రాజేందర్ రెడ్డి, బోరిగాం సర్పంచ్ అమృత, నాయకులు శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, మాజీ ఎంపీటీసీ పోతన్నయాదవ్, డైరెక్టర్లు, భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, నాయకులు రమేశ్, రవీందర్ రెడి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
బాసర, జూలై 16 : బాసరలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల నిల్వ కోసం నిర్మించిన గోదాంను ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఎల్లప్పుడు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. సహకార సంఘాలు రైతుల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గోదాం నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్రావు, నాయకులు నర్సింగ్రావు, సంతోష్రావు, తదితరులు పాల్గొన్నారు.