ఇంద్రవెల్లి, మార్చి 27 : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి పల్లెల్లోని కార్యకర్తలే బలమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయా పార్టీల నుంచి 200ల మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వీరికి ఎమ్మెల్యే కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మీయ సమ్మేళనం ముగింపులో ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని సమ్మేళన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో చరిత్ర సృష్టించిందన్నారు. మారుమూల గ్రామాలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయన్నారు. సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండానే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో 3 వేల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణానికి రూ.3 లక్షలు ప్రజలకు అందిస్తామన్నారు. గ్రామాల్లోని పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, సర్పంచ్లు కోరెంగా గాంధారి, జాదవ్ లఖన్సింగ్, కుడే కైలాస్, రాథోడ్ రాంచందర్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, ఏఎంసీ మాజీ చైర్మన్ రాథోడ్ వసంత్రావ్, బీఆర్ఎస్ నాయకులు దేవ్పూజె మారుతి, కనక హనుమంత్రావ్, కోరెంగా సుంకట్రావ్, పోటే సాయినాథ్, ఆరెల్లి రాందాస్, మహేశ్ కదం, తొడసం హరిదాస్, కేంద్ర శ్యామ్, శివాజీ, కార్యకర్తలు పాల్గొన్నారు.