నేరడిగొండ, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల దీవెనలు సీఎం కేసీఆర్కు అందుతున్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరంట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, నగదు బదిలీ పథకాలతోపాటు సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, శ్మశానవాటికలు, వంటి మౌలిక వసతులు కల్పిస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలో తండాలు, గూడేలు పంచాయతీలుగా మారి పాలన చేరువైందన్నారు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు లబ్ధి పొందేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అందిస్తున్నామని గుర్తు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గమనించిన ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. పేద ప్రజలు, రైతుల కోసం పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఏ సంక్షేమ పథకం కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు కావడం లేదని, ఎందుకో ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతమంతా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం అన్ని రాష్ర్టాలు మన అభివృద్ధిని చర్చించుకుంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్సీని పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, అధికార ప్రతినిధి కిరణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్సింగ్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివారెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు దావుల భోజన్న, తిత్రే నారాయణసింగ్, సీనియర్ నాయకులు భీంరెడ్డి, సయ్యద్ జహీర్, చంద్రశేఖర్ యాదవ్, రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.