మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 9 : మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాస ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేశ్, నస్పూర్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజితను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీరు, సాగునీరు సమస్యతోపాటు విద్యుత్, విద్య, వైద్యం తదితర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, సూచించారు.
గోదావరి నది మీద కరకట్టలు నిర్మిస్తామని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లాకు 2.1 టీఎంసీ నీరందేలా చూస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూస్తానని తెలిపారు. మంచిర్యాలలో కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందు నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తీశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్ల సత్యనారాయణ, ఒడ్డె రాజమౌళి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి రూ.4 లక్షల విలువైన ఎల్వోసీలను నస్పూర్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల సన్మాన సభలో ఎమ్మెల్యే పీఎస్ఆర్ అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే 13 మందికి ఎల్వోసీలు అందజేశామన్నారు. శుక్రవారం లక్షా 50 వేల ఎల్వోసీలు లక్షెట్టిపేటలోని చందారానికి చెందిన పూదరి బుచ్చవ్వ, మంచిర్యాలలోని జన్మభూమి నగర్కు చెందిన ఎం రమేశ్, లక్ష రూపాయల ఎల్వోసీని పట్టణంలోని హమాలీవాడకు చెందిన తోటపల్లి రవి కుటుంబ సభ్యులు అందుకున్నారు.