మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు కుమార్తె కోవ లక్ష్మి.. ప్రజాక్షేత్రంలో విజయానికి చిహ్నంగా నిలుస్తూ తిరుగులేని నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. తన భర్త సోనే రావు ప్రోత్సాహంతో ఓ చిన్న గ్రామానికి ఎంపీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అంచెలంచెలుగా.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచి మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. 28 ఏళ్లుగా ప్రజా సేవకు అంకితమై ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న గిరిబిడ్డపై ‘నమస్తే తెలంగాణ’ సక్సెస్స్టోరీ..
– ఆసిఫాబాద్, డిసెంబర్ 4
ఆసిఫాబాద్, డిసెంబర్ 4 : మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు కుమార్తెగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కోవ లక్ష్మి అంచెలంచెలుగా ఎదిగింది. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టింది. మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టం. కుటుంబాన్ని చూసుకుంటూనే రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగింది. కోవ లక్ష్మి 1995లో తన భర్త కోవ సోనేరావు ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయవంతంగా ముందుకు సాగింది.
1995లో తిర్యాణి మండలం పండిగి మాదర ఎంపీటీసీ స్థానానికి మొదటిసారి నిలబడి గెలిచింది. 2001లో పండిగి మాదర నుంచి మరోసారి ఎంపీటీసీగా గెలిపొందింది. 2002లో తిర్యాణి మండల ఎంపీపీగా సేవలు అందించారు. అనంతరం ఆసిఫాబాద్ పట్టణ సర్పంచ్గా 2006లో గెలుపొందారు. మరోసారి 2013లోనూ ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలిపొందారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 2014లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది పాటు తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి (రాష్ట్ర వ్యవసాయ సహాయ మంత్రిగా) పని చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 171 ఓట్లతో ఓటమిని చవి చూశారు. 23 యేండ్లపాటు ఓటమి లేకుండా ఏ ఎన్నికలు వచ్చినా విజయమే ఆమె సొంతం అయ్యింది. మొదటి సారి ఓటమి కావడంతో నిరాశలో ఉండగా, కేసీఆర్ స్వయంగా జడ్పీ చైర్పర్సన్గా ప్రకటించారు. 2019 జూన్లో జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కుమ్రంభీం జిల్లాకు జడ్పీ చైర్పర్సన్గా ప్రాతినిథ్యం వహిస్తున్న క్రమంలో ముడో సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 22,810 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్పై గెలుపొందింది.
ఎలాంటి కపటం లేకుండా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే మృదుస్వభావి కోవ లక్ష్మి. ప్రజాప్రతినిధిగా తన పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తూ వచ్చారు. తాను చేసిన అభివృద్ధి, ప్రజలతో మమేకం అయ్యి ముందుకుసాగడమే ఆమెకు కలసి వచ్చింది. తిర్యాణి మండలంలోని మొదలైన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగేలా చేసింది. తన తండ్రి కొట్నాక భీంరావు స్ఫూర్తితో ప్రజా సేవకు తన జీవితం అంకితం చేసినట్లుగా కోవలక్ష్మి చెబుతుంది.
రాజకీయాల్లో రాణించాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అందుల్లో రాజకీయంగా ఎదుర్కోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ కోవలక్ష్మి తను నమ్మిన సిద్ధాంతం ఒక్కటే.. తన తప్పును ఒప్పుకోవడంలో వెనుకడుగు వేయదు. నిక్కచ్ఛిగా మాట్లాడడం ఆమెకు కలసి వచ్చింది. రాజకీయంలో ఎదిగేందుకు ఎలాంటి కుట్రలు.. కుతంత్రలు చేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆమె మంచితనాన్ని కొంత మంది ఆసరాగా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.