కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్, ఏప్రిల్ 5 : మనది ప్రజా సంక్షేమ సర్కారు అని, తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదెవేని మల్లేశ్, పీఏసీస్ చైర్మన్ అలిబీన్ హైమద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జగ్గాగౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోనప్ప మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలంతా మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ దండె విఠల్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. పాదయాత్రల పేరిట ప్రజల మధ్యకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్లకు కార్యకర్తలే బుద్ధిచెప్పాలని సూచించారు. అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే బీఆర్ఎస్ కార్యకర్తలందరిదీ ఒకే కుటుంబమని, ఎవరూ నిరాశకు గురికావద్దని, సమయానుకూలంగా అవకాశాలు వస్తాయని తెలిపారు. మతం, కులం ముసుగులో మాయమాటలు చెబుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం : జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి, స్వరాష్ట్రంలో పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటామని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడిన తర్వాత అనేక మంది కార్యకర్తలకు సర్పంచ్లుగా అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిందని, అనేక మందికి కార్యకర్తలకు కౌన్సిలర్లుగా అవకాశం వస్తుందని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారికి అండగా ఉంటామన్నారు. ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామంలో జరిగిన ప్రగతిపై చర్చించాలని సూచించారు. సుమారు రూ. 40 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేశామని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఆసిఫాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కార్యకర్తలను ఆదుకోవాలి : రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు
ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప ప్రత్యేకంగా చొరవ తీసుకొని అప్పపెల్లి, గుండి వంతెనలు, రోడ్డు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు కోరారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తనూ ఆదుకోవాలన్నారు. అంతకుముందు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కార్యకర్తలు భారీ ర్యాలీ తీస్తూ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆసిఫాబాద్లోని ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తాయి.
బీఆర్ఎస్లో చేరిక
ఆసిఫాబాద్, ఏప్రిల్ 5 : జైనూర్ మండలం జామిని గ్రామానికి చెందిన కేంద్రే విశాల్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి నివాసంలో బుధవారం కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండేవిఠల్, ఎమ్మెల్యే ఆత్రం సకు సమక్షంలో బీఆర్ఎస్పార్టీలో చేరారు. విశాల్కు పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, జైనూర్ సర్పంచుల సంఘ అధ్యక్షుడు మడావి భీంరావు తదితరులు ఉన్నారు.