రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి. రైతులతోపాటు కులవృత్తులకు సరైన ప్రోత్సాహం అందిస్తున్న సర్కారు వారికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చెక్కులను అందజేశారు. దాదాపు రూ.3 కోట్ల విలువైన 300 చెక్కులను పంపిణీ చేశారు. నేడు ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న చెక్కులు పంపిణీ చేయనున్నారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన కులవృత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలతోపాటు ఇతర కులవృత్తులవారీకి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తోంది. బీసీల్లో కులవృత్తులు చేసుకుంటూ జీవించే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించి వారి ఉపాధిని మెరుగు పర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ నెలలో ముగియగా.. మీ సేవా కేంద్రాల్లో బీసీ కులవృత్తుల వారు దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు సాయం అందించడానికి అధికారులు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారి జాబితాను తయారు చేశారు. జిల్లాలో చాలా మంది బీసీలు కులవృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతుండగా.. ప్రభుత్వం బీసీలకు అందించే రూ.లక్ష ఆర్థిక సాయం వారి ఉపాధిని మెరుగు పర్చడానికి ఉపయోగపడుతుంది.
బీసీల్లోని కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీ జిల్లాలో ప్రారంభమైంది. బుధవారం బోథ్ నియోజకవర్గంలోని పొచ్చెర క్రాస్ రోడ్డులో గల ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు సాయం అందిం ది. బోథ్లో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ 300 మందికి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బోథ్ 62, తాంసి 37, బజార్హత్నూర్ 28, గుడిహత్నూర్ 33, ఇచ్చోడ 31, భీంపూర్ 39, నేరడిగొండ 26, సిరికొండ 11, తలమడుగు మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగు రామన్న రూ. లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. సర్కారు అందించే ఆర్థిక సాయం వీరి ఉపాధిని మెరుగుపర్చడానికి దోహదం చేస్తోంది.
ఎండాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పేదవాడి ఫ్రీజ్గా పేరొందిన రంజన్లు ఎక్కువగా తయారవుతాయి. తయారీదారులు రంజన్లు మన రాష్ట్రంతోపాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్టలోని వివిధ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకుపోయి విక్రయిస్తారు. బీసీల్లో ఇతరుల కూడా తమ కులవృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందుతారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వీరు యంత్రాలను కొనుగోలు చేయడంతోపాటు వివిధ వస్తువుల తయారీకి అవసరమైన పెట్టుబడి చేకూరనుంది.
బోథ్, ఆగస్టు 9 : తాతల కాలం నుంచి మాది మటన్ వ్యాపారం. చిన్నప్పటి నుంచి మటన్ కొట్టడం.. అమ్మడం నేర్చుకు న్నా. సరైన వసతి లేకున్నా షాపును నడుపుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష సాయంతో షాపును బాగు చేసుకుంట. మేకలు కొనుగోలు చేస్తూ మటన్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటా. నాలాంటి పేదోళ్లకు ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను.
– బాత్నర్ష గంగాజీ, సొనాల
బోథ్, ఆగస్టు 9 : నేను బట్టలు ఉతుకుతూ ఉపాధి పొందుతున్న. గిప్పుడు సర్కారోళ్లు రూ. లక్ష సాయం చేస్తున్నరు. గీ డబ్బులతో ఇస్త్రీ షాపు పెట్టుకుంటా. బట్టలు ఉతుకుతూ.. మిగతా సమయంలో ఇస్త్రీ చేస్తా. మాలాంటి పేదోళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేసీఆర్ సర్కారు నేరుగా సాయం అందిస్తూ బతుక్కు భరోసానిస్తున్నది. ఇందుకు జీవితాంతం రుణపడి ఉంటం
– పొన్నం గంగామణి, గిర్నూర్, బజార్హత్నూర్