ఎదులాపురం, మే28: రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని 40వ వార్డు దస్నాపూర్లో రూ.40లక్షల తో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ముందుగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం నేతలతో కలిసి భూమిపూజ చేశారు. అభివృద్ధి పనుల తీరుపై చర్చించి పలు సూచనలు చేశారు. అంతకుముం దు అతిథులను స్థానికులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు.
ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించడంలో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. అభివృద్ధికి వినియోగిస్తున్న నిధులు కేంద్రానికి అయితే బీజేపీ నేతలు భూమిపూజ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ భరత్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, నాయకులు రాంకుమార్, అశోక్, కుమ్ర రాజు, మిట్టపురే యోగేశ్, అనిల్, ఆసిఫ్ పాల్గొన్నారు.