జైనథ్ , ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. గ్రామస్తులు డప్పువాయిద్యాలతో స్వాగతం పలుకగా.. సమ్మేళనంలో గ్రామాలవారీగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ కమిటీ అధ్యక్షులు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెంచిన బీజేపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామన్న బీజేపీ రూ.400 గ్యాస్ ధరలను రూ.1200లకు పెంచిందని విరుచుకుపడ్డారు. రైతాంగానికి కేంద్ర విధానాలతో తీవ్ర నష్టం జరుగుతున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 18 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు.
రూ.40 కోట్లతో తరోడా బ్రిడ్జి నిర్మిస్తాం..
రూ.40 కోట్లతో తరోడా బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామని, మే మాసంలో పనులు మొదలవుతాయని ఎమ్మెల్యే వెల్లడించారు. బీజేపీ నాయకులు బ్రిడ్జి వద్దకు వెళ్లి అనవసర రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమ్మ న్యూస్ యాజమాన్యం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గణేశ్యాదవ్, ఎంపీటీసీ భోజన్న, నాయకులు కోల పరమేశ్వర్, భగవంత్రావు పాల్గొన్నారు.