ఆదిలాబాద్ రూరల్, జూలై 22 : ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజు శనివారం వర్షం దంచికొట్టింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని జీఎస్ స్టేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలోని ఇండ్లల్లో వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే హ్యాండీక్యాప్ కాలనీ, బంగారిగూడ, ఖానాపూర్, సర్వే 170 కాలనీల్లోని ఇండ్లలోకి వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లో సామగ్రి తడిసి ముద్దయ్యాయి.
ఉప్పొంగిన పెన్గంగ
జైనథ్, జూలై 22 : మండలంలో పెన్గంగనదితో పాటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలైన కామయి, పెండల్వాడ, ఆనంద్పూర్, కూర, గిమ్మ, కరంజి, కాప్రి, దీపాయిగూడ, ఉమ్రి, సాంగ్వి, కౌఠ గ్రామాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారు జామున పెరిగిన వర్షానికి పెన్గంగ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా వరదతో పంటలు మునిగిపోయాయి.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెన్గంగ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు ఆపమ్రత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలో పెన్గంగ బ్రిడ్జి వద్దకు చేరుకున్న వరద ఉధృత్తిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు పునరావాసం కల్పించాలన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఏడీఏ పుల్లయ్య, ఎంపీవో వెంకటరాజు, ఏవో వివేక్, జనార్దన్ ఉన్నారు.
సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సాత్నాల ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 15300 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. ఉదయం 16500 క్యూసెక్కుల వరద నీరు రిజర్వాయర్లోకి వచ్చింది. ప్రాజెక్టు నీటి మట్టం 286.50మీటర్లు ఉండగా ప్రస్తుతం 284.60 మీటర్లకు చేరింది.
పెన్గంగ సరిహద్దు గ్రామాల పరిశీలన
బేల, జూలై 22 : పెన్గంగ పరివాక ప్రాంతాల్లోని పలు గ్రామాలను తహసీల్దార్ సర్ఫరాజ్ నవాబ్ పరిశీలించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్గంగ నీటి మట్టం పెరిగిందని, ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నారని పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఆయన వెంట ఆర్ఐ గీత, నారాయణ, సిబ్బంది, సర్పంచ్లు ఉన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, జూలై 22: బోథ్ మండలంలో 122.08 మిల్లీ మీటర్ల్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో పెద్దవాగు, మర్లపెల్లి వాగు, ధన్నూర్(బీ) వాగు, సొనాల వాగు, కండ్రివాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోథ్ సమీపంలోని కండ్రివాగు వద్ద పైపులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో మర్లపెల్లి ప్రాంతంలోని 25 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధన్నూర్(బీ), పొచ్చెర, బోథ్, సొనాల, కౌఠ(బీ) ప్రాంతాల్లో పత్తి, సోయా పంటల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో మొక్కలు ఎర్రబారి ఎండిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మత్తడి పరవళ్లు.. మూడు గేట్ల ఎత్తివేత
తాంసి, జూలై 22 : మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మత్తడి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 16500 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 15300 క్యూసెక్కుల వరద చేరింది. దీంతో ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తివేశారు. దిగువకు 15300 క్యూసెక్కుల నీరు వదిలారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 277.3 మీటర్లు ఉందని మత్తడి ఏఈ హరీశ్కుమార్ తెలిపారు.
30 గ్రామాలకు రాకపోకలు బంద్
తాంసి మండలంలోని సావర్గాం, పిప్పల్కోటి గ్రామాల మధ్య గల ప్రధాన రహదారిపై ఉన్న లోలెవెల్ వంతెన నీట మునిగింది. వాగుపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో అటు ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలు, ఇటు తాంసి, భీంపూర్ మండలాల నుంచి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భీంపూర్ మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్బంధంలో గోట్కురి గ్రామం
తాంసికి అనుకొని ఉన్న వాగు మత్తడికి పరవళ్లు తొక్కుతుంది. గోట్కురి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. గుబిడి గ్రామ సమీపంలోకి పెనుగంగకు వరద వచ్చి ఆగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతానికి విద్యార్థులు
తాంసి, జూలై 22: మండలంలోని కప్పర్ల ఎస్సీ హాస్టల్ గదుల్లో నీరు చేరింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మండల కేంద్రంలోని వసతి గృహానికి విద్యార్థులను తరలించారు. స్పెషల్ ఆఫీసర్ కిరణ్, ఎంపీడీవో భూమయ్య, తహసీల్దార్ శ్రీదేవి, డీటీ బాబుసింగ్, నారాయణ్ రెడ్డి వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిచ్చారు. వరదతో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా రైతు వేదిక, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వారికి ఆవాసం కల్పించారు.
పొచ్చెర జలపాతం వద్ద తగ్గని వరద ఉధృతి
బోథ్, జూలై 22: పొచ్చెర జలపాతం వద్ద వరద ఉధృతి కొనసాగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పెద్దవాగు, పొచ్చెర వాగుల్లో వరద భారీగా వచ్చి చేరింది.
గుడిహత్నూర్, జూలై 22 : మండలంలోని ముత్నూర్, శంభుగూడ, సీతాగోంది చెరువుల్లోకి వరద చేరడడంతో నిండుకుండలాగా కనిపిస్తున్నాయి. టాకిగూడ గ్రామానికి వెళ్లే దారిలోని వాగు వరద ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టుకు గండిపడింది. తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో సునీత పరిశీలించారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, జూలై 22: మండలంలోని భూతాయి, దేగామ, బజార్హత్నూర్, కాండ్లీ, కోల్హారి, జాతర్ల గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద భారీగా వచ్చి చేరింది. వాగులు వంకలు వరద నీటితో గలగల పారుతున్నాయి. చింతల్స్వాంగి గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటువైపుగా వెళ్లే గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా దేగామ చెరువులోకి భారీగా వరద వచ్చి చేరింది.
తలమడుగు, జూలై 22: సుంకిడిలోని భీమన్న వాగు పొంగ్లిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి పంటలు దెబ్బతిన్నాయి. రుయ్యాడి, సాకినపూర్ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి నీరు చేరడంతో మట్టి గోడలు కూలిపోయాయి. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎస్ఐ ధనశ్రీ గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
నార్నూర్, జూలై 22 : గాదిగూడ మండలం ఖడ్కి, లోకారి(కే), మేడిగూడ, అర్జుని లోలెవల్ కల్వర్టులపై భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ప్రయాణికులను వరద ప్రవాహం నుంచి దాటించేందుకు సహకరించారు. నార్నూర్ మండలం దన్నుగూడ, బారిక్రావ్ గ్రామాల సమీపంలో వాగులు వరదతో పొంగిపొర్లయి.
ఉట్నూర్ రూరల్, జూలై 22: మండలంలోని శ్యాంపూర్ నుంచి లక్షెట్టిపేటగ్రామానికి వెళ్లే రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. హీరాపూర్(జే), తేజాపూర్, బలాన్పూర్, దంతన్పల్లి, బిర్సాయిపేట్ గ్రామాల్లో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పర్యటించారు. వరదలకు కొట్టుకుపోయిన పంటలు చేన్లలో వేసిన ఇసుక మేటలను పరిశీలించారు. పంట నష్టం విలువ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అదే విధంగా దంతన్పల్లి, పెర్కాగూడ, శ్యాంపూర్, పులిమడుగు, నాగాపూర్ గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
నిండుకుండలా ముత్నూర్ త్రివేణి సంఘం ప్రాజెక్టు
ఇంద్రవెల్లి, జూలై 22: మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలోని త్రివేణి సంఘం ప్రాజెక్టులో భారీగా వరద చేరింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సామర్థ్యానికి మంచి వరదనీరు చేరడంతో మత్తడిపై నుంచి పారుతుంది. లాల్టేకిడిలో కల్వర్టు కోతకు గురికావడంతో గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. జైత్రంతండా చెక్డ్యాం మత్తడిపై నుంచి వరద ఉద్రిక్తంగా పారడంతో గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. వాల్గోండ వాగు వరదనీరు బ్రిడ్జిపై నుంచి పోవడంతో బ్రిడ్జితో పాటు బీటీరోడ్డు కోతకు గురయ్యాయి. వాగులకు అనుకొని ఉన్న పంటపోలాల్లో వరద చేరడంతో పంటలు నీటిలో మునిగిపోయాయి.