ఆదిలాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘బండి సంజయ్.. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నావ్ ఖబడ్దార్..’ అని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న హెచ్చరించారు. పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పేపర్ లీకేజీకి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి ప్రశాంత్తో కలిసి కుట్రపన్నారని ఆరోపించారు. ప్రశాంత్ రెండు గంటల్లో 142 మందికి ఫోన్లు చేసి, లీకేజీ విషయం తెలియజేశారున్నా రు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వ సూచనల మేరకే సంజయ్ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని, వారికి సరైన సమయంలో బుద్ధిచెబుతారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకే ఆ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. పేపర్ లీకేజీపై బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని రామన్న డిమాండ్ చేశారు. అందుకు కారణమైన బండి సంజయ్పై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, ఆత్మ చైర్మన్ జిట్టా రమేశ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
పేపర్ల లీకేజీలో బీజేపీ కార్యకర్తలు..
గ్రూప్-1 పేపర్ లీకేజీలో నిందితుడు రాజశేఖర్, పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీకి కారణమైన ప్రశాంత్ ఇద్దరూ బీజేపీ కార్యకర్తలేనని ఎమ్మెల్యే అన్నారు. ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. సంజయ్ విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సరికాదని, చదువులు, ఉద్యోగాలు పక్కన పెట్టి ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేయాలని సూచించడాన్ని తప్పుపట్టారు. పేపర్ లీకేజీకి సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఏమైనా సంఘటనలు జరిగితే బీజేపీ అధ్యక్షుడు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం నిధుల మంజూరులో రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని, ధమ్ముంటే నిధులు తెచ్చేందుకు కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఎన్ని నాటకాలాడినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలేదని తెలిపారు.