ఎదులాపురం, నవంబర్ 25: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్, సంజయ్నగర్, తదితర కాలనీల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మలతో మహిళలలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సైతం బతుకమ్మను ఎత్తుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
సంజయ్నగర్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా జరిగిన అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో పట్టణ అభివృద్ధికి కోట్లాది నిధులు వెచ్చించి ప్రజల ఇక్కట్లను దూరం చేశామన్నారు.
బీజేపీ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ప్రస్తుతం మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షలాది సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించి యువతకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బడాల సుజాత, ఆవుల వెంకన్న, లక్ష్మణ్, నాయకులు శివకుమార్, సృజన్, మెట్టు ప్రహ్లాద్, చిన్న పటేల్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 25 : రైతుబంధును అడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓట్ల ద్వారా తరిమికొట్టాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని జైజవాన్నగర్, మహాలక్ష్మివాడ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ రైతుబంధు నగదు విడుదలపై ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతుబంధు కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంద నర్సింగ్, పందిరి భూమన్న, రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, నాయకులు రంగినేని శ్రీనివాస్, గోలి శంకర్ పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 25 : ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నను గెలిపించాలని శనివారం మండలంలోని జైనథ్, పిప్పర్వాడ, లక్ష్మిపూర్, పెండల్వాడ, నిరాల, కోరట, సిర్సన్న, దీపాయిగూడ, కమాయి గ్రామాల్లో నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం పోతారెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రశాంత్రెడ్డి, రాములు, ప్రభాకర్, మహేశ్, ఊశన్న, గంగన్న, ఉమేశ్ పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 25 : మండలంలోని పూసాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుర్రి సంతోష్తో పాటు ఆయన అనుచరులు శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో చేరగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై గ్రామ గ్రామాన యువకులు, ఇతర పార్టీల నాయకులు భారీగా పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి పోతారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.