జైనథ్, జూలై 3 : ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం మాండగడ, పెండల్వాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాండగడలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ , పెండల్వాడలో పాఠశాలలో కార్తీక్రెడ్డి షూస్ అందజేయడం అభినందనీయమన్నారు.
విద్యార్థులకు సమక్షంలో జన్మదిన వేడుకలు
పెండల్వాడ పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖిరాలను అదిరోహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ఎంపీపీ విజయ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు బాలురి గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తంయాదవ్, నాయకులు రమేశ్, చంద్రయ్య, సర్పంచ్లు సురేశ్, ఇందు, మహేందర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 3 : జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందస్తు వేడుకల్లో భాగంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. జోగు రామన్న చిత్రంతో కూడిన మాస్క్లను ధరించి చిన్నారులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆకట్టుకున్నది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
ఎదులాపురం, జూలై 3 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో గౌడగడప హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఈత చెట్లను నాటి నీరు పోశారు. ముందుగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, గౌడ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు గజానంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, నాయకులు పందిరి భూమన్న, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొనాలి
ఎదులాపురం, జూలై 3: ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న మోగా రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానాలు పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం పట్టణంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఇటీవల బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన గంగారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.