నేరడిగొండ, డిసెంబర్ 4 : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన బోథ్ నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులను కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం కట్టబెట్టిన ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. విజయం కోసం కృషి చేసిన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వీచిన బోథ్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం వారి ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు చెంపపెట్టుగా విజ్ఞతతో తీర్పు చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి హామీలను ప్రజలలోనే ఉంటూ నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. బోథ్ నియోజకవర్గ ప్రజలు అన్ని గమనించి అందించిన గొప్ప విజయాన్ని బీఆర్ఎస్కు అందించారని పేర్కొన్నారు.