మంచిర్యాల, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది. జిల్లాలో కీలక నేతలుగా ఉన్నప్పటికీ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఇద్దరు అన్నదమ్ములను సభలో దక్కాల్సిన ప్రాధాన్యం దక్కలేదు. సభా వేదికపై ముందు వరుసలో కాకుండా రెండో వరుసకే వారిని పరిమితం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ముందు వరుసలో అది మినిస్టర్ అని రాసి ఉంచిన కుర్చీలో కూర్చున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవీ అంటూ ఇస్తే అది పీఎస్ఆర్కే ఇస్తామనే సంకేతాలు ఇచ్చినట్లేనని ఆయన వర్గీయులు ప్రచారం మొదలు పెట్టారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో పీఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన్నీ అభినందించారు. కానీ.. వారి ప్రసంగంలో ఎమ్మెల్యేల హోదాలో ఉన్న గడ్డం వినోద్, గడ్డం వివేక్ల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.