ఆదిలాబాద్ : పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగులు ప్రసరించాయని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. పోడు పట్టాల పంపిణీలో భాగంగా గురువారం తాంసి మండల కేంద్రంలో తలమడుగు – 318, తాంసి – 12, భీంపూర్ – 164 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ నాడు ఆదివాసీ, గిరిజన బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి వారిని చిత్ర హింసలకు గురిచేసి తప్పుడు కేసులు బనాయించేవారు.
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కేసులను తొలగిస్తూ భూమి పట్టాలను అందజేసి గిరిజనులకు అండగా నిలిచారన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గిరిజన, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, ఎంపీపీలు శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీలు రాజు, గోక గణేశ్ రెడ్డి, మొట్టే కిరణ్ కుమార్, తోట వెంకటేశ్, నాగయ్య, తారుడి అరుణ్, సర్పంచ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.