ఇచ్చోడ, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ బైపాస్ నుంచి విఠల్రెడ్డి గార్డెన్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో గంగాధర్గౌడ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుండడం, మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించడం వంటి వాటితో పంటలు పుష్కలంగా పడుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి గ్రామానికి రూ. కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య కోసం ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ఏర్పాటు చేసిన మహనీయుడని కొనియాడారు. ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు మిషన్ భగీరథ నీళ్లను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
అభివృద్ధికి అండగా నిలవాలి..
– రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్యే, బోథ్.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలను ఏదో ఒక రూపంలో అందిస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించడం వల్ల బాల్య వివాహాలు తగ్గాయని పేర్కొన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్ ద్వారా ఆరోగ్య తెలంగాణగా మారిందని వెల్లడించారు.
200 మంది బీఆర్ఎస్లో చేరిక
వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, మాజీ ఎంపీపీ తుర్కే సుభాష్ పటేల్, మాజీ కన్వీనర్ మెహరాజ్ అహ్మద్, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్, ఉపాధ్యక్షుడు సుద్దవార్ వెంకటేష్, బీసీ సెల్ ప్రెసిడెంట్ గణేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గాయికంబ్లే గణేశ్, సోషల్ మీడియా కన్వీనర్ భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ ప్రవీణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు మహేశ్ పాల్గొన్నారు.
సబ్బండవర్గాల సంక్షేమం కోసమే పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబ్బండ వర్గాల సంక్షేమం కోసమే పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, సబ్సిడీలు, రుణమాఫీ చేస్తున్నదని, ఎక్కడా కూడా ఎరువులు ఇబ్బంది లేకుండా అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. ఎమ్మెల్యే బాపురావ్ హయాంలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి.
– ఏనుగు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్.