కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ సిర్పూర్ (యు), ఏప్రిల్ 12 : రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ నగేశ్తో కలిసి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గిరివికాసం ద్వారా ప్రత్యేకంగా గిరిజన రైతులకు సాగునీరందించే పథకాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయని స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులకు త్వరలోనే పహనీలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ ఎందుకు పార్లమెంటులో మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏజెన్సీలోని దళితుల సంక్షేమానికి దళితబంధు ద్వారా ఆర్థిక సహాయం అందించి, వారు స్థిరపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు, స్థానిక జడ్పీటీసీ కోవ అరుణ, ఎంపీపీ భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, ఏఎంసీ చైర్మన్ భగవంత్రావు, పార్టీ నాయకులు గొడసం ధర్మారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాయమాటలు నమ్మొద్దు..
– మాజీ ఎంపీ జీ నగేశ్
మాయమాటలు చెబుతూ గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను నమ్మొద్దు. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ మాటలను నమ్మితే చాలా నష్టం జరిగింది. గిరిజనుల ఓట్లతో గెలిచిన ఆ పార్టీ ఎంపిక, ఒక్కసారి కూడా బీజేపీ ఈ ప్రాంతంలో పర్యటించలేదు. ఆదివాసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధి లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వొద్దు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీ గ్రామాలన్నింటికీ త్రీఫేజ్ విద్యుత్ వసతి కల్పించింది. గిరి వికాసంతో సాగునీటి వసతి అందుబాటులోకి వచ్చింది. సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదివాసీలు అండగా ఉండాలి.
జీవో 3ని పునరుద్ధరించేలా చర్యలు
– ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
ఏజెన్సీలోని గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో భద్రత కల్పించే జీవో నంబర్ 3ని సుప్రీం కోర్టు కొట్టివేయడంతో స్థానికంగా ఇబ్బంది ఏర్పడుతున్నది. త్వరలోనే దీనిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి విన్నవిస్తాం. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ గెలుపునకు కృషి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది.