కెరమెరి, ఏప్రిల్ 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఆదివాసీ పోరాట యోధుడికి ఘనకీర్తి లభించిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు జోడేఘాట్ అభివృద్ధిని విస్మరించారని, అమరుని వర్ధంతికి కూడా హాజరుకానివ్వకుండా హట్టికే పరిమితం చేసిన విషయాన్ని మరచిపోలేమన్నారు. ఆనాడు వందల సంఖ్యలో నిర్వహించే వేదికను నేడు 40 వేల మందికి సరపడా వేదికను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆదివాసీ, మైనార్టీ, దళిత, క్రైస్తవ వంటి అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్సే అని వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులు సాగు చేస్తున్న భూములకు పంట రుణాలతోపాటు, రైతుబంధు ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నదని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావ్ మాట్లాడుతూ.. ప్రజల పార్టీ బీఆర్ఎస్ను మరోమారు గెలిపించుకోవాలని కోరారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అబూల్ కలాం మాట్లాడుతూ.. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదివేణి మల్లేశ్, వైస్ ఎంపీపీ అబూల్ కలాం, పార్టీ మండలాధ్యక్షుడు రాథోడ్ ఉత్తం నాయక్, బీఆర్ఎస్ నాయకులు మోహర్లె శంకర్, సుండే నారాయణ, షేక్ యూనుస్, కేంద్రే బాలాజీ, సయ్యద్ ఫయాజ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కుమ్రం నాణేశ్వర్ పాల్గొన్నారు. ఈ సభకు వాంకిడి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.