కడెం, జూన్ 13: అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కేంద్రం అనుమతులు ఇవ్వక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అద్దాల తిమ్మాపూర్, గుర్రంమధిర గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నూతన పంచాయతీల ఏర్పాటుతో నేడు అన్ని గ్రామాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. ప్రతి పంచాయతీకి నర్సరీ, శ్మశాన వాటిక, డంప్యార్డ్, పల్లెప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం, ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం, ట్యాంకర్ల ద్వారా హరితహారంలో భాగంగా మొక్కలను సంరక్షించడం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.
గిరిజన, అటవీ గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో కనీసం కరెంట్కు నోచుకోని అనేక గ్రామాలు నేడు 24 గంటల కరెంట్తో పాటు, వ్యవసాయానికి విద్యుత్ను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలు చెప్పిన పలు సమస్యలను విని తక్షణమే పరిష్కారం చూపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, సర్పంచ్లు ఆరంపెల్లి శాంత, ఉర్వేత భీంబాయి, కనక పద్మబాయి, మర్చ మాన్కుబాయి, మీసాల రంభదేవి, సదర్లాల్, నాయకులు పాల్గొన్నారు.