అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దశాబ్దాల నీటి గోసను తీర్చింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం సత్ఫలితాలనిస్తున్నది. కొండలు, కోనలు, గుట్టలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి నట్టింట సాక్షాత్కరిస్తున్నది. తాగునీరు ఇంటి ఆవరణలో గలగల పారుతుంటే గిరిజనులు చిరునవ్వులు చిందిస్తూ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. రోగాలకు చెక్ పడడమే కాకుండా.. ఆరోగ్య జలమై ప్రాణం పోస్తున్నది. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 11 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి.. 3,746 ఆవాసాల్లో 5,84,681 నల్లా కనెక్షన్లు బిగించారు. రూ.2,411 కోట్లు వెచ్చించి 7,722 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు.
నిర్మల్, జూన్ 17(నమస్తే తెలంగాణ) : గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరమైన తాగునీటిని అందించడంలో విఫలమయ్యాయి. ఎండాకాలం వచ్చిందంటే గుక్కెడు తాగునీటికి ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపేవారు. తాగునీటికి పంచాయతీలు, మున్సిపాలిటీలను ముట్టడించేవారు. దీంతో ఆయా పాలక వర్గాలు కంటితుడుపు చర్యగా ట్యాంకర్లు, ఆటోల ద్వారా అరకొర నీటిని అందించి చేతులు దులుపుకునేవి. చాలీచాలని నీళ్లతో రాత్రింబవళ్లు నిద్రలు మాని బిందెలతో గొడవలు చేసుకునే పరిస్థితులు గతంలో ఉండేవి. పంచాయతీలు బోర్లు వేయలేక, వేసినా భూగర్భ జలాలు లేక నీళ్లు పడక తాగునీటి సమస్య నిత్యకృత్యంగా ఉండేది. ఈ పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్.. స్వరాష్ట్రంలో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు.
2014లో పురుడు పోసుకున్న భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తానని చెప్పిన మాటలను నిజం చేసి, నేడు అద్భుతాన్ని ఆవిష్కరించారు. 2018 నుంచి అంటే దాదాపు ఐదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి గడపకూ మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయి. మొత్తం 3,746 ఆవాసాలకు సుమారు రూ.2,411 కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను కల్పించి శుద్ధమైన నీటిని అందిస్తున్నారు. భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డల ఇక్కట్లు దూరమయ్యాయి. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఇంటి ముంగిటకే స్వచ్ఛమైన జలాలు వస్తుండడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 701 ఆవాసాలు ఉండగా, 685 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. మరో 16 గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఆయా గ్రామాల్లో సోలార్ సిస్టం ద్వారా ఇంటింటికీ నీరందే ఏర్పాటు చేశారు. కాగా.. జిల్లాలో ప్రతి ఇంటికీ నీరందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.829 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులతో జిల్లావ్యాప్తంగా 1,738 కిలో మీటర్ల మేర పైప్లైన్ వేసి 1,49,072 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు 437 ఓవర్ హెడ్ ట్యాంకులు, ఐదు ప్రాంతాల్లో ఫిల్టర్బెడ్లను నిర్మించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో 1,234 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకానికి రూ.1023 కోట్లు ఖర్చు చేయగా, 1990 కిలో మీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేసి 1,50,646 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అలాగే 978 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఒక నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1144 ఆవాసాలకు శుద్ధ జలం అందుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులతో 1,406 కిలో మీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం నీటి సరఫరా కోసం 893 ఓవర్ హెడ్ ట్యాంకులను, రెండు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించారు. జిల్లావ్యాప్తంగా 1,14,052 నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో 667 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందుతోంది. ఆయా గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.334 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులతో జిల్లావ్యాప్తంగా 2,588 కిలో మీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. అలాగే మూడు నీటిశుద్ధి కేంద్రాలు, 563 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించారు. మొత్తం 1,70,911 నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు.
సమైక్య పాలనలో తాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. పైపులైన్ల నిర్మాణంలో నిలువెల్లా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రతి వేసవిలో బిందెడు నీటి కోసం జనం అల్లాడిపోయారు. పబ్లిక్ నల్లాల వద్ద మహిళలు కుస్తీ పట్టాల్సిన దుస్థితి. తెలంగాణ సర్కారు వచ్చాక ఈ పరిస్థితిని రూపుమాపా లని నిర్ణయించుకున్నాం. నీటి కష్టాలను తీర్చేందుకు ఇంటింటికీ రోజూ నల్లా నీళ్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్నాం. అందుకే ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టాం. నిర్మాణాలకు వేల కోట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు శుద్ధజలాన్ని అందించి తీరుతాం.
– 2018లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
మంచినీటి గోస తప్పింది..
కుభీర్, జూన్, 17 : మా ఇంట్లో ఆరుగురం ఉంటం. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు, మా అత్త-మామ. మా అందరికీ ఎండాకాలంలో అయితే నాలుగు బిందెలు, మామూలు కాలంలో అయితే రెండు బిందెల తాగునీరు అవసరం. మా వీధిలో 50 కుటుంబాలు ఉండగా.. వీరందరికీ కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద ఉన్న బావే ఆధారం. ఈ బావి మా ఇంటి నుంచి అర కిలోమీటరు దూరం ఉంటుంది. మా ఇంట్లో ఎవరిమైనా ఇద్దరం ఉదయం, సాయంత్రం బిందెలు తీసుకొని వెళ్లేది. దాదాపు గంట నుంచి మూడు గంటలు గడిస్తే గాని మా వంతు వచ్చేది కాదు. ఒక్కోసారి గొడవలు కూడా అయ్యేవి. సీఎం కేసీఆర్ సారు చలువతో మా ఇంటి ఆవరణలోనే మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్ ఇచ్చారు. మంచి నీటి బాధలు తప్పాయి.
– గంగామణి, పల్సి(కుభీర్ మండలం)
తాగునీటి కష్టాలు తీరాయి..
మా ఊరులో తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రం ఏర్పడిన తరువాత మా ఊరులో ఇంద్రకరణ్రెడ్డి వచ్చి నీళ్లు వచ్చె ప్లాంట్ను మన ఊరులో పెడుతున్నాం అని చెప్పిండ్రు. మాకే నీళ్లు లేవు నిర్మల్ వరకు నీళ్లు ఇస్తాం ఇక్కడి నుంచి అని చెప్పిండ్రు. నమ్మలేక పోయాం. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి, ఇంద్రకరణ్రెడ్డి చొరవతో మా ఊరుకు తాగునీటి సమస్య పూర్తిగా తీరింది. నల్లా తిప్పితే నీళ్లు వచ్చేలా చేసిండు. ఇప్పుడు ఇబ్బందులు తీరాయి.
– నీరజ, మాడెగాం