మంచిర్యాలటౌన్, అక్టోబర్ 21 : ఎన్నికల నోటిఫికేషన్కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు చేరువయ్యారు. ఇక అసలు సంగ్రామం మొదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ నెల 7న మంత్రి హరీశ్రావు పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహాన్ని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించగా, బీజేపీ అభ్యర్థి ఎవ్వరో తేలాల్సి ఉంది. ఆయా పార్టీలు ఇంకా ప్రచారమే మొదలుపెట్టకపోగా.. బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు గడిచిన నెల రోజులుగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మంచిర్యాల, నస్పూర్, లక్షెటిపేట మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్, లక్షెటిపేట, దండేపల్లి మండలాల్లో పర్యటించి.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో దూసుకుపోయారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు ఇంటింటికీ బీఆర్ఎస్ పేరుతో నియోజకవర్గంలోని అన్ని పట్టణాల్లోని వార్డులు, అన్ని మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఏ ఊరిలో చూసిన చేరికల జోరు కనిపిస్తున్నది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి బీఆర్ఎస్కు ఏకపక్షంగా మారింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ జనంలోకి వెళ్తున్నది. వెళ్లిన ప్రతిచోట ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దివాకర్రావుతో పాటు ఆయా పట్టణాలు, మండలాల్లోని నాయకులు జనాలకు వివరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సైతం తెలంగాణ రాక ముందు ఎట్లున్న జిల్లాను తెలంగాణ వచ్చాక ఎలా అభివృద్ధి చేసుకున్నామనే విషయాలను వివరించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల మున్సిపాలిటీలో రూ. 25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు (సీఎం ఫండ్) వెచ్చించి 36 వార్డుల్లో చేపట్టే సిమెంటురోడ్లు, డ్రైనేజీలు, 10 చోట్ల నిర్మించే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. రూ. 15 కోట్లు వెచ్చించి లక్ష్మీటాకీసు చౌరస్తానుంచి లక్షెటిపేట రోడ్ వైశ్య భవన్ వరకు నిర్మించిన బైపాస్రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. పాతమంచిర్యాలలో రూ. 2 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు, రూ. 70 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. అండాళమ్మకాలనీలో రూ. 70 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాలుకు భూమిపూజ చేశారు. హైటెక్ కాలనీలో రూ. 2 కోట్లు వెచ్చించి నిర్మించిన పార్కు, పిల్లల పార్కులను ప్రారంభించారు. రూ. 35 కోట్లతో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మించే ఆరు వరుసల రహదారి పనులకు ఎంపీ వెంకటేశ్నేతకానితో కలిసి శంకుస్థాపన చేశారు.
మంచిర్యాల పట్టణంలోని ఆరోవార్డులో డిగ్రీ కాలేజీ వెనకాల మైదానంలో రూ. 8 లక్షల సీడీపీ నిధులతో నిర్మించిన కళావేదిక భవనాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రారంభించారు.
లక్షెటిపేట మున్సిపాలిటీలో గడిచిన నెలరోజుల్లో రూ. 12 కోట్లతో 15 వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపనలు, రూ. 13 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, వరదకాలువ నిర్మాణం, కంపోస్టు యార్డు, సెంట్రల్ లైటింగ్, పెరుక, యాదవ కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపనలు, రూ. 58 లక్షలతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన, రూ. 1.50 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో పూర్తయిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, ఎస్డీఎఫ్ నిధులు రూ. 60 లక్షలతో చెల్లంపేట చిన్నయ్య ఆలయానికి వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ, రూ. 2 కోట్లతో అంకతిపల్లి, పోతపల్లి గ్రామాల మధ్య హైలెవెల్ వంతెనకు భూమిపూజ, రూ. 60 లక్షలు వెచ్చించి మార్కెట్ యార్డులో గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నస్పూర్ మున్సిపాలిటీలో గడిచిన నెలరోజుల్లో రూ. 5.41 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టే 34 పనులకు, పట్టణ ప్రగతి నిధులు రూ. 5.65 కోట్లతో చేపట్టే 16 పనులకు, ఎస్డీఎఫ్ ఫండ్ రూ. 25 కోట్లతో చేపట్టే 371 సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు భూమిపూజలు, శంకుస్థాపనలు చేశారు.
దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సీడీపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అల్లీపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని మోకాసిగూడలో రూ. 1.58 కోట్లతో నిర్మించిన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. దండేపల్లి మండల కేంద్రంలో రూ. 48 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. నెల్కివెంకటాపూర్, కొర్విచెల్మ, రెబ్బెనపల్లి గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు.
హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న 50 మంది దళిత కుటుంబాలకు 75 గజాల ఇంటి స్థలాల పట్టాలను ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమా-రవిలతో కలిసి పంపిణీ చేశారు. గుడిపేటలో జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో రూ. 20 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. నంనూర్ గ్రామ పంచాయతీలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ. లక్షతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, గుడిపేటలోని కార్మెల్ పాఠశాల వద్ద స్ట్రీట్ లైట్లను, పడ్తన్పల్లి గ్రామ పంచాయతీలోని రాంపూర్లో డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ. లక్షతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, పెద్దంపేట గ్రామ పంచాయతీలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ. లక్షతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, బుద్దిపల్లి గ్రామ పంచాయతీలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ. లక్షతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, గుడిపేటలో ఎంఎన్ఆర్ఈజీఎస్ రూ. 17 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, రూ. 4 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కిచెన్ను ప్రారంభించారు.
దొనబండ గ్రామం నుంచి పెద్దంపేట గ్రామాల రహదారిలో గ్రామీణ రహదారుల మరమ్మతుల నిధుల ( ఎంఆర్ఆర్) రూ. 60 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. పెద్దంపేట నుంచి కొలాంగూడకు వెళ్లేందుకు వంతెను నిర్మాణానికి రూ. 65 లక్షలు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం మరో రూ. 65 లక్షలతో చేపట్టే పనులకు భూమిపూజ నిర్వహించారు. కర్నమామిడి గ్రామంలో సమగ్ర శిక్ష నిధుల నుంచి రూ. 3.50 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. రాపల్లి గ్రామంలోని పునరావాస కాలనీలో మన ఊరు-మన బడి కార్యక్రంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 28 లక్షలతో నిర్మించిన అదనపు తరగతులను ప్రారంభించారు.
ఎంపీపీ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించనున్న మహిళా డ్వాక్రా భవన నిర్మాణానికి ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో కలిసి భూమి పూజ చేశారు. పడ్తన్పల్లి గ్రామ శివారులో 80.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న లిప్ట్, దొనబండ గ్రామంలో రూ. 3 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత సబ్ స్టేషన్కు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు భూమి పూజ చేశారు. కర్నమామిడి గ్రామంలో రూ. 5 లక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న ఐకేపీ భవనం, పడ్తన్పల్లి గ్రామంలో రూ. 5 లక్షల సీడీపీ నిధులు, దొనబండ గ్రామంలో రూ. 5 లక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న భవనాలకు ఎమ్మెల్యే దివాకర్రావు భూమి పూజ చేశారు.