బెల్లంపల్లి/రామకృష్ణాపూర్, ఏప్రిల్ 12 : పార్టీకి అంకితమై ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న సీనియర్లకు గౌరవమివ్వడం లేదని మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి ప్రభాకర్ యాదవ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ సమక్షంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావా ల్సి ఉండగా, మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బండి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఇతర మండలాల నాయకులకు సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు, స్థానిక నాయకుడినైన తనకు మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రికి తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం నెలకొంది. మంత్రి జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో ప్రభాకర్ శాంతించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతుండగా నాయకులు, కార్యకర్తలు మంత్రిని సన్మానించేందుకు పోటీ పడ్డారు.
తాను చెప్పేది ఎవరూ కూడా వినడం లేదంటూ ఆయన అసహనానికి గురయ్యారు. ఇక రామకృష్ణాపూర్ లోని శివాజీనగర్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమం లో సాక్షాత్తూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదుటే లుకలుకలు బయట పడ్డాయి. రామకృష్ణాపూర్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అప్జల్ (లాడెన్) మాట్లాడుతూ పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకు ఆదరణ కరువైందని అదే వేదిక పక్కన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చుట్టూ చేరి భజన చేసే వాళ్లకి మాత్రమే కాదు.. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కూడా గౌరవమివ్వాలని కోరారు. దీంతో అక్కడున్న మిగతా నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.