ఎదులాపురం, జనవరి 27 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఖాళీల వివరాలు, సీనియారిటీ జాబితాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయాలని, అన్ని అంశాలతో కూడిన పాఠశాలలను మాత్రమే ప్రారంభించాలని సూచించారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సీనియారిటీ ఖాళీల వివరాలకు సంబంధించిన జాబితాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు తెలిపారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద జిల్లాలో ప్రతి మండలానికి రెండు చొప్పున 18 మండలాల్లో 37 మోడల్ పాఠశాలలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 18 పాఠశాలల్లో వందశాతం పనులు అన్ని అంశాల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారి నారాయణ, డీపీవో శ్రీపద్ తదితరులు పాల్గొన్నారు.