భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన యువతీయువకుల్లో జోష్ నింపింది. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించిన మంత్రి యువతే లక్ష్యంగా వరాల జల్లు కురిపించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐటీ కంపెనీల రాక, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఓరియంట్ ప్లాంట్ విస్తరణ పనులతో వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానికంగానే ఉద్యోగాలు లభించే అవకాశం ఉండడంతో యువతీయువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– బెల్లంపల్లి, మే 9
బెల్లంపల్లి, మే 9 : పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు. ఈనెల 8న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు హోం మంత్రి మహమూద్ అలీ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేతకాని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శివారులోని 355 ఎకరాల స్థలంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ నాలుగో ప్లాంట్ విస్తరణ పనులనూ ప్రారంభించారు. కాల్టెక్స్ ఏరియాలోని సనాతన ఎనలిటిక్స్, వాల్యూ పిచ్ ఐటీ కంపెనీలను సందర్శించిన మంత్రి కేటీఆర్ భవిష్యత్లో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బెల్లంపల్లిలో రూ.114.89 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి త్వరలోనే బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామన్నారు. రూ.2 వేల కోట్లతో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ నాలుగో ప్లాంట్ విస్తరణ ప్రారంభమైతే 4 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 27 కంపెనీలు ఏర్పాటుకానున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఐటీ కంపెనీల రాక, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఓరియంట్ ప్లాంట్ విస్తరణ పనులతో వేలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకనున్నాయి. కేటీఆర్ వరాల జల్లుతో స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చరిత్రాత్మకం
బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమైన నిర్ణయం. సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లిలో చాలా మంది విద్యార్హతలు ఉన్నా సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు సాధించడంలో వెనుకబడుతున్నారు. ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తే యువతలో దాగి ఉన్న ఉద్యోగ, వృత్తి నైపుణ్యాలకు పదునుపెట్టవచ్చు. ఈ సెంటర్ ఏర్పాటుతో స్థానిక యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ నాలుగో ప్లాంట్తో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అక్కడి గిరిజన యువతకు చాలా వరకు లాభం జరగనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఇంజినీరింగ్ కళాశాలగా ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు సదూర నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి రాదు. యువత ఉద్యోగాలపై ప్రకటనలు చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు.
– జోరిగల విజయ్
బెల్లంపల్లి ఐటీ హబ్గా మారుతోంది..
బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో ఇప్పటికే సనాతన ఎనలిటిక్స్, వాల్యూ పిచ్ వంటి ఐటీ కంపెనీలు ఉన్నా యి. ఈ కంపెనీలో స్థానిక యువత ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లి భారీ బహిరంగ సభలో త్వరలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతమున్న కం పెనీలతో పాటు భవిష్యత్లో ఇక్కడికి మరిన్ని ఐటీ కంపెనీలు వస్తే బెల్లంపల్లి ఐటీ హబ్గా మారుతుంది. దీంతో బెల్లంపల్లి పట్టణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. వివిధ కంపెనీల రాకతో రవాణ, ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీంతో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయి.
– గాండ్ల మధు
స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయి..
బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు నెలకొల్పితే స్థానికంగానే ఉద్యోగాలు చేసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూర్ ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే ఇంటి పట్టున ఉంటూ, తల్లిదండ్రుల క్షేమ సమాచారాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు. బెల్లంపల్లికి ఐటీ కంపెనీలు రావడం శుభప్రదం. మంత్రి కేటీఆర్ తెలంగాణ రా ష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి తన శక్తివంచన లేకుం డా కృషి చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలతో పోటీ పడి మరీ హైద రాబాద్లో కంపెనీలు పెట్టించడానికి ముందుకు వెళ్తున్నారు. మంత్రి ఇచ్చిన హామీతో త్వరలో బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నా. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు అవుతారు. ఐటీ కంపెనీల రాకతో సాంకేతికపరంగా బెల్లంపల్లి అభివృద్ధి చెందుతుంది.
– ఏబూసి శ్రీనివాస్
ఫుడ్ ప్రాసెసింగ్తో యువతకు ఉపాధి..
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శివారులో 455 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 27 రకాల సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పుతాయి. ప్రతి కంపెనీలో స్థానిక యువతకే ప్రాధాన్యమిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడి నిరుద్యోగ యువతకు వరం లాంటింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించలేదు. మంత్రి కేటీఆర్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపైనే దృష్టి సారిస్తున్నారు.
– అందె అశోక్