బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్ రేపు(బుధవారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ పట్టణం, సోన్, దిలావార్పూర్ మండలాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇలా దాదాపు రూ.1,157 కోట్ల పనుల ప్రారంభోత్సవంలో స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిలతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు అల్లోల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మల్ నియోజకవర్గం నుండే కాకుండా ముథోల్, ఖానాపూర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలిరానుండగా.. ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. కేటీఆర్ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయాలని అల్లోల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
– నిర్మల్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ) : ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలో రూ.714 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-27(శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఎత్తిపోతల పథకం)ను ప్రారంభించనున్నారు. అలాగే నిర్మల్ పట్టణంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.23.91 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ నల్లా నీటి సరఫరాను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభిస్తారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి పలుమార్లు ప్యాకేజీ-27 వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి చేయనున్న ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..
రూ.250 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 83,800 ఎకరాల భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,565 మంది రైతులు సాగు చేయగా, ఈ ఏడాది మరో 8 వేల ఎకరాల్లో మొక్కలను నాటించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం భారీ నర్సరీని సారంగాపూర్ మండలంలోని బీరవెల్లిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం 13.65 లక్షల ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయిల్ పామ్ రైతులకు భవిష్యత్లో మార్కెట్ సదుపాయాన్ని కల్పించి, వారిలో నమ్మకాన్ని పెంచేందుకు ప్రభుత్వం పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. నిర్మల్తోపాటు చుట్టు పక్క జిల్లాల ఆయిల్ పామ్ రైతులకు ఆదాయం సమకూరేలా నిర్మల్ సమీపంలోని పాత పోచంపాడు వద్ద పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నది. ఈ పరిశ్రమ పనులకు బుధవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలో ప్రస్తుతం గంటకు 15 టన్నుల పామ్ గెలలను మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నదని, భవిష్యత్లో దీనిని గంటకు 90 టన్నుల సామర్థ్యానికి పెంచుతామని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.
సమీకృత మార్కెట్తో తీరనున్న ఇబ్బందులు..
కొత్త జిల్లాల ఏర్పాటుతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో పట్టణం రోజు రోజుకూ విస్తరిస్తున్నది. దినదినాభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో ఎక్కడబడితే అక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్ల మార్కెట్లు ఉండడంతో పట్టణవాసులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు, వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ కూరగాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకే సీఎం కేసీఆర్ పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ పట్టణ నడిబొడ్డున సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 ఎకరాల 30 గంటల్లో రూ. 10.15 కోట్లతో నిర్మించే ఈ మార్కెట్కు బుధవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. జీ ప్లస్ వన్ తరహాలో నిర్మించే ఈ మార్కెట్లో కింది అంతస్తులో 136 కూరగాయల దుకాణాలు, మొదటి అంతస్తులో 34 మాంసం విక్రయ దుకాణాలు, నిత్యావసర సరుకుల కోసం మరో 18 కమర్షియల్ షాపులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్ అందుబాటులోకి వస్తే అటు రైతులు, వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులకు వేసవిలో, వానకాలంలో కలిగే ఇబ్బందులు తప్పనున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపై నిలిపి కొనుగోలు చేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడేది. ఇక్కడ నిర్మించే సమీకృత మార్కెట్లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుండడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి.
నిర్మల్లో భారీ బహిరంగ సభ..
మంత్రి కేటీఆర్ నిర్మల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలంతా ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మల్ నియోజకవర్గం నుండే కాకుండా, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలిరానున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను హైలెట్ చేస్తూ కేటీఆర్ పర్యటనకు రావాల్సిందిగా జనాన్ని ఆహ్వానిస్తున్నారు.