దిలావర్పూర్, సెప్టెంబర్ 12 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 25న నిర్మల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ రాజ్ ఉప కార్యనిర్వాహక కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో, ప్రజాప్రతినిధులకు అం దుబాటులో ఉండేలా పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 15న నిర్మల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్యాకేజీ 27 పనులను మంత్రి కేటీఆర్ ఈ నెల 25న ప్రారంభించి రైతులకు సాగు నీరు అందిస్తారని తెలిపారు.
ఇక్కడి నుంచి సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్పామ్ పరిశ్రమకు, రూ.14 కోట్లతో జాతీయ రహదారి సోన్ నుంచి జాఫ్రాపూర్ వర కు నిర్మించే డబుల్ రోడ్డు పనులకు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పే ర్కొన్నారు. కార్యక్రమం అనంతరం నిర్మల్ ఎన్టీఆర్ గార్డెన్లో మంత్రి కేటీఆర్తో బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్ర జాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్షర- అనీల్, పీఆర్డీఈ తుకా రాం, ఏఈ శివకృష్ణ, ఎంపీడీవో మోహన్, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్నదేవేందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కోడే రాజేశ్వర్, అన్వర్ఖాన్, బీఆర్ఎస్ నా యకులు పాల్ధే అనీల్, ఆడెపు శ్రీనివాస్, గంగారెడ్డి, కోడే నవీన్, శ్రీనివాస్రెడ్డి, గుణవంత్ రా వు, దనే రవి, సప్పల రవి, ఒడ్నం కృష్ణ, పాల్ధే శ్రీనివాస్, వినోద్కుమార్, నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.32 కోట్లతో ఆలయాల నిర్మాణం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 12 : నిర్మల్ పట్టణంలో రూ.32.13 కోట్లతో 162 ఆలయాలను నిర్మించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సాలహారం, గ్రానైట్ పనుల నిర్మాణానికి మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవరకోట ఆలయం చాలా పురాతనమైందన్నారు. ఈ ఆలయ కల్యాణ మండపానికి రూ.20 లక్షలు, రూ.50 లక్షలతో షెడ్డు, ఇతర అభివృద్ధి పనులకు రూ.1.20 కోట్లు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అడెల్లి ఆలయాన్ని రూ.15 కోట్లతో కృష్ణ శిలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ విజయదశమికి ఆలయం ప్రారంభం కానున్నదని తెలిపారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్ మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆలయ మాజీ అధ్యక్షుడు ఆమెడ కిషన్, లింగంపల్లి లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ తదితరులు పాల్గొన్నారు.