నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. నిన్న.. మొన్నటి దాకా పార్టీలో ఉన్న ఆ కాస్త అసంతృప్తి తొలగిపోగా, అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల గెలుపుకోసం నాయకగణం ఏకతాటిపైకి వచ్చింది. ఖానాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ను పక్కన పెట్టి కొత్త అభ్యర్థి జాన్సన్ నాయక్కు టికెట్ ఇవ్వడాన్ని శిరసావహిస్తామంటూ మూకుమ్మడిగా ప్రకటించడం కలిసి వస్తున్నది. ఇక నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వగా, ఇక్కడ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనను మళ్లీ గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తమవుతోంది. ముథోల్లో కొంత మంది సీనియర్లు టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విఠల్రెడ్డికే మొగ్గు చూపడం.. ఇక్కడ ఆయనకున్న క్యాడర్ను బట్టి చూస్తే గెలుపు అవకాశాలు సులువయ్యాయన్న చర్చ సాగుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లలో అభ్యర్థిత్వాలపై ఇప్పటికీ స్పష్టత రాకపోగా, ఆ పార్టీల శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నది.
నిర్మల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపై నడుస్తూ గెలుపు దిశగా పయనిస్తున్నది. ఆ పార్టీలో నిన్న.. మొన్నటి దాకా కొంతమేర ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలగి పోవడం, నాయకులు, కార్యకర్తలు అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం మరింత కష్టపడి పనిచేస్తామంటూ ప్రకటించడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నది. మిగతా పార్టీల కంటే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఎంతో బలంగా ఉన్నది. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు. కొత్తగా నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి నిర్మల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు. ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతుండడం అక్కడి బీజేపీ, కాంగ్రెస్లను కలవరపెడుతోంది. ఈ రెండు పార్టీల్లో అసంతృప్తి, అసమ్మతి, సమన్వయ లోపంతో సతమతమవుతూ ఇప్పటికీ అభ్యర్థిత్వాలపై స్పష్టత లోపించడం ఆయా పార్టీల శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోటీకీ సై అంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో సతమతమవుతున్నాయి.
మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయం..
ఖానాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ను పక్కన పెట్టి కొత్త అభ్యర్థి జాన్సన్ నాయక్కు టికెట్ ఖరారు చేయడంతో అక్కడి పార్టీ వర్గాలు సంబురాలు చేసుకుంటున్నాయి. మొదట కొంత అసంతృప్తి ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరిగినా.. నాయకులు, కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు మూకుమ్మడిగా ప్రకటించడంతో పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు రెండింతలయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ అధికార బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాల కారణంగా బీజేపీ, కాంగ్రెస్లు కనీస స్థాయిలో పోటీ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇదిలా ఉంటే నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికే మళ్లీ పార్టీ టికెట్ను ఖరారు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. మంత్రిగా ఆయన నిర్మల్ నియోజకవర్గానికి గత దశాబ్ధ కాలంగా చేసిన సేవలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇంద్రకరణ్రెడ్డి గెలుపును నల్లేరుపై నడకలాగా చేయబోతున్నాయి. కాగా.. ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికే ఈ సారి టికెట్ రావడం ఖాయమంటున్నారు. అయితే మహేశ్వర్రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ సీనియర్ నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సమయంలో ఆయన వెన్నంటి ఉన్న వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నారు.
మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలను చాలా సందర్భాల్లో మహేశ్వర్రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీని కారణంగా ఆ పార్టీలోనే అంతర్గతంగా రెండు గ్రూపులు ఏర్పడ్డాయంటున్నారు. రోజు రోజుకూ అసంతృప్తి పెరిగిపోతుండడంతో కొంత మంది ఆ పార్టీ సీనియర్లయిన మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేని నర్సాగౌడ్ ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇలా అసంతృప్తి, అసమ్మతి కారణంగా ఆ పార్టీలో సమన్వయం కోల్పోవడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే ముథోల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఇక్కడ కొంత మంది సీనియర్లు టికెట్ను ఆశించినప్పటికీ అధిష్టానం సిట్టింగ్కే ఖరారు చేయడంతో మొదట్లో కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ, అధిష్టానం సూచనలు, సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి చర్చలతో ఆ అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందంటున్నారు.
దీంతో విఠల్రెడ్డికి గెలుపు అవకాశాలు సులువు అయ్యాయన్న చర్చ జరుగుతున్నది. ఇక్కడి బీజేపీలో ముగ్గురు సీనియర్ నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్న కారణంగా ఆ పార్టీలో ఐక్యత లోపించిందంటున్నారు. ఒకరికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే జరిగితే ఆ పార్టీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు సరైన అభ్యర్థి కూడా కనిపించడం లేదు. ఇద్దరు కొత్త వ్యక్తులు ఇటీవలే ఆ పార్టీలో చేరి టికెట్ను ఆశిస్తున్నప్పటికీ పోటీ విషయంలో వారు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు ఉండవంటున్నారు. కాగా ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కేడర్ను ఏకతాటిపై నడిపించే బాధ్యతనంతా ఎమ్మెల్సీ దండె విఠల్కు పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన నిర్మల్ జిల్లాలోనే ఎక్కువ సమయం గడుపుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ సమన్వయం కొనసాగేటట్లు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యాన్ని పరిశీలిస్తే జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు దాదాపుగా ఖాయమేనని చెబుతున్నారు.