పేదలకు ఖరీదైన వైద్యమందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.1.50 కోట్లతో సీటీ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించడంతో పాటు బోథ్లో రూ.10.50 కోట్లతో నిర్మించబోయే 50 పడకల దవాఖాన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లు మంజూరయ్యాయని, రాబోయే సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 22 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖరీదైన వైద్యమందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.1.50 కోట్లతో సీటీ స్కానింగ్ యంత్రాన్ని ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయన్నారు. నిర్మల్ జిల్లా వైద్య రంగంలో అభివృద్ధి చెందుతుందని, కార్పొరేటుకు దీటుగా ఇక్కడ సేవలందుతున్నాయని పేర్కొన్నారు.
దవాఖానలో అదనపు పడక గదుల నిర్మాణం చేపట్టామని, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని, సర్జరీలు పూర్తిగా తగ్గాయని చెప్పుకొచ్చారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, రూ.42 కోట్లతో ప్రధాన దవాఖాన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.166 కోట్లు మంజూరయ్యాయన్నారు. టెండర్ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామన్నారు. రాబోయే సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రూ. 30 కోట్లతో గురుకులాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల రెండు పడకగదులు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 1200 ఇండ్లు పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, కలెక్టర్ వరుణ్రెడ్డి, కమిషనర్ అజయ్కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, పారిశ్రామిక వేత్త మురళీధర్రెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ నజీరొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు, అధికారులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
మంత్రి హరీశ్రావు పర్యటన రద్దు
నిర్మల్ ప్రధాన దవాఖానలో సీటీ స్కానింగ్ యంత్రం ప్రా రంభోత్సవానికి రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్కు ఆయనను పిలవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే తలమానికం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
బోథ్, ఫిబ్రవరి 22 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్ నియోజకవర్గ కేంద్రంలో రూ.10.50 కోట్లతో 50 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొన్ని పార్టీలు అసూయపడుతున్నాయన్నారు. పక్క రాష్ర్టాల వారు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 575 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
24 గంటల విద్యుత్ సరఫరాలో డిమాండ్ పెరిగితే రోజుకు రూ.50 కోట్లు వెచ్చించి అన్నదాతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ. 10 వేల రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. త్వరలోనే స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు అందిస్తామని తెలిపారు. కుఫ్టి ప్రాజెక్టు నిర్మాణంతో 6 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని, కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు ఎత్తిపోతల ద్వారా బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లోని పొలాలకు సాగు నీరందుతుందన్నారు. బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నిర్వహణ కోసం నూతన భవనాన్ని మంజూరు చేయాలని పలువురు న్యాయవాదులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, అజ్మీరా శ్యాంనాయక్, విఠల్రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎంపీపీలు తుల శ్రీనివాస్, సజన్లాల్, జడ్పీటీసీలు సంధ్యారాణి, అనిల్ జాదవ్, సుధాకర్, తాటిపెల్లి రాజు, ఏఎంసీ చైర్మన్ రుక్మణ్సింగ్, బీఆర్ఎస్ కన్వీనర్ నారాయణ్రెడ్డి, సురేందర్యాదవ్, జగన్మోహన్రెడ్డి, తాహెర్బిన్సలాం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్రావు దేశ్పాండే, కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు కత్తూరి సుభాష్, హరీశ్ పాల్గొన్నారు.
కంటి పరీక్షలు చేయించుకున్న మంత్రి..
బోథ్లోని కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సందర్శించారు. పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్ష చేయించుకున్నారు. డీఎంహెచ్వో డాక్టర్ రాథోడ్ నరేందర్, సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రప్రసాద్, సొనాల పీహెచ్సీ వైద్యుడు నవీన్రెడ్డి పాల్గొన్నారు.