దళితబంధు, రైతుబంధు, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్టు వంటి అనేక ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మబంధువుగా మారాడని, రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలుపుతున్న మహానాయకుడని ఆర్థిక, వైద్యా రోగ్యాశాఖ మాత్యులు హరీశ్రావు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బుధవారం ఒకేరోజు దాదాపు రూ.230 కోట్ల విలువైన పనులకు మంత్రి ఐకేరెడ్డి, విప్ సుమన్లతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా పలు సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. ఉద్యమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ బాల్క సుమన్ చెన్నూర్ను అగ్రస్థానంలో నిలుపుతున్నారన్నారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని బస్డిపోను నెరవేర్చిన ఘనత బాల్క సుమన్కే దక్కుతుందన్నారు. చెన్నూర్కు 50 పడకల మాతా శిశు సంక్షేమ దవాఖానను మంజూరు చేస్తున్నాను. రెవెన్యూ డివిజన్ చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. రూ.1600 కోట్లతో నిర్మించనున్న చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
మంచిర్యాల, మార్చి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలతో కేసీఆర్ తెలంగాణ ఆత్మబంధువయ్యాడు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రూ.230 కోట్లతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఆయన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ సుమన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. చెన్నూరు దశ, దిశను మారుస్తూ.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చెన్నూరు ప్రజలకు ఎమ్మెల్యే బాల్క సుమన్ రుచి చూపిస్తున్నారన్నారు. నేను గతంలో చాలా సార్లు చెన్నూరుకు వచ్చానని, కానీ.. అప్పటి చెన్నూరు కాదని, చేంజ్డ్ ఊరులా ఉందన్నారు. ఇవాళ ఉదయం నుంచి చెన్నూరులో కొబ్బరికాయలు కొట్టి నా చేతులు నొప్పి పెడుతున్నాయన్నారు.
దాదాపు 30 జాగల్లో కొబ్బరి కాయలు కొట్టానన్నారు. జైపూర్లో రూ.37 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జితో మొదలై, రూ.22 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, రూ.3 కోట్లతో స్టేడియం, రూ.4 కోట్లతో బస్సుడిపో, రూ.18 కోట్లతో పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అద్భుతమైన బట్టర్ ైప్లె లైట్లు, మా అక్కా చెల్లెళ్ల కోసం ఈ ఊరు, ఆ ఊరు అనే తేడా లేకుండా రూ.14 కోట్లతో 77 సమ్మక్క-సారక్క భవనాలు నిర్మించేందుకు సుమన్ కృషి చేస్తున్నారన్నారు. నెలనెలా మీటింగ్లు పెట్టుకునే అక్కాచెల్లెళ్లు చెట్టు కింద కూర్చొవొద్దని ఊరూరుకీ ఒక భవనం కడుతున్నారన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులకు గ్రామగ్రామాన 100 లైబ్రరీలు కట్టే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. చెన్నూరులో కేసీఆర్ పార్క్ బాగుందన్నారు. అది చూస్తుంటే చెన్నూరులో ఉన్నామా.. ఇంకా ఎక్కడైనా ఉన్నామా అనిపించిందన్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ చాలా అద్భుతంగా ఉందని, కూరగాయలు, చేపలు, మాంసం దుమ్ములో రోడ్డుమీద పెట్టి అమ్ముకునే రోజులు పోయాయన్నారు. రూ.1,600 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రేపోమాపో శంకుస్థాపన చేసుకుంటామన్నారు. మంత్రి హరీశ్రావు ప్రసంగం ఆయన మాటల్లోనే..
గతంలో చెన్నూరులో వైద్యశాఖ మంత్రి ఉన్నా దవాఖాన రాలే..
ఇంతకుముందు చెన్నూరులో దావాఖానే లేకుండే. కానీ.. ఇవాళ 100 పడకల ఆస్పత్రికి కొబ్బరికాయ కొట్టినం. దానికి తోడు 50 పడకల మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి మా చెన్నూరుకు కావాలని సుమన్ అడిగారు. సుమన్పై ఒక ఉద్యమకారుడిగా ఉన్న ప్రేమతో వెంటనే మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి కూడా మంజూరు చేస్తున్నా. 150 పడకల ఆస్పత్రులు, బస్సు డిపో ఇవ్వన్ని అయ్యే పనులా.. ఆ రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మనిషే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఇక్కడికి ఆసుపత్రి రాలేదు. కానీ.. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే ఉన్నడు కాబట్టే 150 పడకల ఆస్పత్రులు వచ్చినయ్. అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతంలో బస్సు డిపో కావాలని చేసిన ఎన్నో పోరాటాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ఎన్నికల నినాదాలు ఈ రోజు నిజం కావడం మీ అందరి అదృష్టం. అలాగే చెన్నూరు దశ, దిశను మారుస్తూ రూ.1,600 కోట్లతో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా మంజూరైంది. టెండర్లు కూడా అయిపోయాయి. రేపో, మాపో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. చెన్నూరులో 30 ఏండ్లు కాంగ్రెస్, 20 ఏండ్లు టీడీపీ వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారి హయాంలో 50 ఏండ్లలో చేయని పనులు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయంటే అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.
నాడు తంటాలు.. నేడు ప్రతి గింజకు కాంటాలు..
ఆనాడు కాంగ్రెస్ హయాంలో చెన్నూరులో వ్యవసాయం చేయాలంటే ఎన్నో తంటాలు, కరెంట్ కోసం, కాలిపోయే మోటర్లు కోసం, ట్రాన్స్ఫార్మర్లతో తంటాలు. ఇవాళ మన కేసీఆర్ నాయకత్వంలో పండిన ప్రతి గింజకు కాంటాలు. ఇది వాళ్లకు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. దేశం మొత్తం ఈ యాసంగిలో ఎంత వరి పండుతుందో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అంత వరి పండుతంది. మనతో వేరు పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఈ యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కానీ.. మన దగ్గర 56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఆ నాడు కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, పోంగపోంగ మనందరికీ కరెంట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే మీరు ఎట్లా బతుకుతరు అన్నాడు. మీ కంతా చీకటే అన్నడు. కానీ.. ఇవాళ 16 వేల మెగావాట్ల కరెంట్ ఇచ్చి, 30 లక్షల బోర్లకు మోటర్లకు నీళ్లిచ్చి, 56 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నాం. మన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారింది. ఇది తెలంగాణ సాధించిన విజయం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరువును తరిమేసిండు. తెలంగాణ పరువును ఆకాశమంత ఎత్తుకు పెంచాడు.
ఏ పథకం తెచ్చినా.. మా అక్కచెల్లెళ్ల కోసమే..
సీఎం కేసీఆర్ ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా మా అక్కచెల్లెళ్ల కోసమే. ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి ఇప్పుడు గృహలక్ష్మి కూడా స్టార్ట్ కాబోతున్నది. మొన్ననే కేబినెట్లో ఆమోదించాం. పేదవాళ్లు సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు మీ అకౌంట్లలో వేసే కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి పైసా ఉపయోగపడుతదనే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3లక్షలు కూడా అక్కాచెల్లెళ్ల పేరుమీదనే వేయమన్నారు. భర్తలకు ఇస్తే తొవ్వంట ఖర్చులు ఏమైనా ఉంటాయని, మీకిస్తేనే బరాబరి ఉపయోగపడుతాయని చెప్పారన్నారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఈ రోజు స్టార్ట్ చేసే గృహలక్ష్మి ఏదైనా మహిళల కోసమే. మీ బిడ్డగానీ, కోడలు గానీ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు ఇచ్చి, ఆటో కిరాయి లేకుండా తల్లినిబిడ్డను తెచ్చి చెన్నూరు కాడ దించి పోతున్నారు. ఇప్పుడు దానికి తోడు సీఎం కేసీఆర్ ఇంకో కొత్త స్కీమ్ పెట్టారు. మీ అందరికీ కేసీఆర్ కిట్టు అంటే ఏందో తెలుసు. ఇప్పుడు కొత్తగా న్యూట్రిషన్ కిట్టు ఇవ్వబోతున్నాం.
ఈ శ్రీరామనవమి పండుగ వెళ్లగానే సుమన్ వచ్చి ప్రారంభిస్తాడు. బిడ్డ కడుపులో నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్టు అయితే.. బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్టు. చాలా మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాంటి గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలి. బలంగా ఉండాలే. వాళ్లు బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు. బిడ్డ బలంగా ఉంటేనే మన తెలంగాణ రాష్ట్రం బలంగా ఉంటుంది. మన దేశం బలంగా ఉంటుందని ఈ న్యూట్రిషన్ కిట్టు కార్యక్రమం స్టార్ట్ చేశాం. కల్యాణలక్ష్మి, ఇంటింటికీ మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు కావాలే అని ఎవరూ అడగలే.. కానీ.. మా తల్లులకు ఏం కావాలో ఆలోచించిన చేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే.
సింగరేణిని అమ్మేసే కుట్ర..
బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు చేసినా ఒక్క మంచిపనైనా ఉందా? మంచి పనులు లేవు.. కానీ.. ఉన్న సింగరేణిని అమ్మేసే కుట్ర చేస్తున్నారు. ఇదే చెన్నూరు ప్రాంతంలో రెండు బొగ్గు బావులను వేలానికి పెట్టి, సింగరేణిని నష్టాల బాట పట్టించే కుట్ర చేస్తా ఉన్నది బీజేపీ. అలాంటి బీజేపీకి మీరే గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. వాళ్ల పాలనలో తాగు, సాగు నీరు లేవు. కనీసం ఎరువులు సరఫరా చేయడానికి వారికి చేత కాలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. రోజురోజుకు దేశంలో కాంగ్రెస్ కనుమరుగైపోతా ఉంది.
బీజేపీ ఏమో ఎంత సేపు సీబీఐలు, ఐటీలు పట్టుకొని పోతున్నది. ఈ విషయాన్ని ప్రతి రైతు సోదరుడు దయచేసి ఆలోచించాలి. ప్రజల కోసం పోరాటం చేసి.. ప్రాణాలకు తెగించి.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాకుండా… సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్గా నిలిపిన కేసీఆర్ నాయకత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి, బలపరచాలని నేను మీ అందరినీ పేరుపేరునా కోరుతున్నా. చెన్నూరు పట్టణంలో రోడ్లు, మురికి కాలువలకు రూ.25 కోట్లు మున్సిపల్ మంత్రితో మాట్లాడి చెన్నూరు పట్టణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా. రెవెన్యూ డివిజన్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. ఈ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తా.
ఉద్యమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ సుమన్ నంబర్ 1..
ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా సుమన్ పోరాటాన్ని దగ్గరి నుంచి చూశా. కానీ.. ఈ రోజు అదే ఉద్యమస్ఫూర్తి.. నేడు చెన్నూరు అభివృద్ధిలో చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఉద్యమంలోనే కాదు, చెన్నూరు అభివృద్ధిలోనూ సుమన్ నెంబర్-1గా నిలిచారు. నాడు ఉద్యమమైనా, నేడు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలోనైనా ఒకే చిత్తశుద్ధి, నిజాయితీ కనిపిస్తా ఉంది. ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల ఆయనలో సుస్పష్టంగా ఉంది.
నిధులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. అలా డబ్బులు రావడం ముఖ్యం కాదు దగ్గరుండి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని వినియోగించుకోవడం ముఖ్యం. సొంత ఇంట్లో మనషుల్లా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు సుమన్ చేస్తున్న కృషిని నిజంగా అభినందిస్తున్నా. ఎదిగిన నాయకుడు.. మెదిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి ప్రేమను పొందిన నాయకుడు మన చెన్నూరుకు ఉండడం నిజంగా మీ అదృష్టం. పోయిన సారి సుమన్ను 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ తాప 56 వేల మెజార్టీతో గెలించాలి. ఇంకా.. ఈ చెన్నూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలంటే సుమన్ను మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి.
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్ ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూర్ ఎనలేని ప్రగతి సాధించిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో సైనికుడిలా పని చేస్తున్న బాల్క సుమన్ చెన్నూర్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పారు. తునికాకు కూలీలకు బోనస్ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నదని, మంచిర్యాల జిల్లాలో తునికాకు బోనస్ చెన్నూర్ నియోజకవర్గానికి రూ.18 కోట్లు, బెల్లంపల్లికి రూ.10 కోట్లు, మంచిర్యాలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. గతంలో తునికాకు కట్ట ధర రూ.2.5 ఉండగా, ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.3 పెంచడం జరిగిందన్నారు. ప్రజలు మేలు కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని, అడవులను రక్షించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూర్ నియోజకవర్గాన్ని 30 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ, 20 ఏండ్లపాటు తెలుగుదేశం పార్టీ పాలించినా ఎలాంటి మార్పు కనిపించలేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైన వారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కొంతమంది ఈ ప్రాంతంలో తిరుగుతూ అభివృద్ధి జరగలేదని అంటున్నవారు వారి హాయంలో ఏం జరిగిందో ఒకసారి చూసుకోవాలన్నారు. చెన్నూర్కు బస్డిపో తీసుకురావడంలో, 100 పడకల దవాఖాన తీసుకురావడంలో ఎవ్వరు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు రూ.160 కోట్లు వెచ్చించడం జరిగిందని చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు రూ.1,600 కోట్ల వ్యయంతో చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు. నాలుగేళ్లలో రెండేళ్ల పాలన కరోనాతో ఇబ్బంది పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో చెన్నూర్ నియోజకవర్గాన్ని ఎనలేని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, చెన్నూర్ గడ్డ పై బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు.
నాలుగేండ్లుగా తమ పార్టీ నాయకులు ఎంతో ఓపిగ్గా ఉన్నారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ఓపికతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ శిష్యుడిగా, ఉద్యమ నాయకుడిగా చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎంపీ వివేక్ 2వేల కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయిస్తే తానే వివేక్ను సన్మానం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం కొనసాగాలన్నా, చెన్నూర్ మరింత అభివృద్ధి చెందాలన్నా బీఆర్ఎస్ జెండానే ఎజెండా అని అన్నారు. చెన్నూర్కు పక్కనే ఉన్న సింగరేణి మైన్లు ఎవరి హయాంలో మూతపడ్డాయని, మంత్రిగా ఉన్న సమయంలో వెంకటస్వామి కొడుకు, వివేక్ అన్న అయిన వినోద్ ఏం చేశాడని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ ఈ ప్రాంతానికి ఏం చేశాడో చెప్పాలన్నారు. వెంటకస్వామి మూడు సార్లు సిద్దిపేట ఎంపీగా, నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీ, కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, జౌళి శాఖ మంత్రి, కార్మికశాఖ మంత్రిగా పనిచేసినా.. చెన్నూర్ నియోకవర్గానికి వెంకటస్వామి ఏం చేశాడో చెప్పాలన్నారు. 1952 నుంచి చెన్నూర్ నియోజకవర్గ ఓటర్ల భిక్షతో ఇంత ఎత్తుకు ఎదిగిన వెంకటస్వామి కుటుంబం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అవకాశం ఉన్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా పెద్దపెద్ద కార్పొరేట్లతో తిరుగుతూ ఆస్తులు సంపాదించుకున్నారని అన్నారు. తనకు ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు రూ.500 కోట్ల వ్యయంతో పామాయిల్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తున్నానని, జైపూర్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ప్లాంట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో విస్తరణ చేస్తున్నామన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో చెన్నూర్ నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరించి, సమస్యల్లేని నియోజకవర్గంగా చేసుకుంటామని చెప్పారు.