నిర్మల్ అర్బన్, జూన్ 4 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, 2 వేల మందికి డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ, మైనార్టీ గురుకుల పాఠశాల భవనం, రూ.166 కోట్లతో మెడికల్ కళాశాల భవనానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయడం సంతోషకరమన్నారు. భారీ ఎండలు ఉన్నా జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అశేష జనం సభకు తరలిరావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లా ఏర్పడిన తర్వాత కాళేశ్వరం నీళ్లను పోచంపాడుకు.., ఇక్కడి నుంచి స్వర్ణ ప్రాజెక్టుకు తీసుకురావడం జరుగుతున్నదన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందని, అలాగే జేఏన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలో దశల వారీగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు ఒక్క సమస్యా పెండింగ్లో లేదని, ఖానాపూర్లో రోడ్లు, ముథోల్లో గుండెగాం, అర్లి, లిఫ్ట్ ఇరిగేషన్లకు పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ను కోరారు. మహారాష్ట్రతో పాటు, దేశంలో ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పలికి, గెలిపించి తీరుతారని తెలిపారు. సీఎం హామీలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గ్రామగ్రామానా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రైతులకు ఇబ్బందులు దూరమయ్యాయని పేర్కొన్నారు. సీఎం సభకు తరలివచ్చిన ప్రజానీకానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.