నిర్మల్ టౌన్, మే 6: నిర్మల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల(ఇరిగేషన్) ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే 27, 28 ప్యాకేజీ పనులతో పాటు సదర్మాట్, చెక్డ్యాంల నిర్మాణం, చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన 27 ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని, వచ్చే సీజన్లో చెరువులను నింపి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 27 ప్యాకేజీపనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదర్మాట్ బ్యారేజీ గేట్ల ముగింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని తెలిపారు. చెరువులు, కాలువలు మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో నిత్యం 5వేల లీటర్ల పాల సేకరణ
నిర్మల్ అర్బన్, మే 6 : జిల్లాలో నిత్యం 5వేల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని పాడిపరిశ్రమ పనితీరుపై జిల్లా డీడీ మధుసూదన్తో క్యాంపు కార్యాలయంలో మంత్రి చర్చించారు. జిల్లాలో నిత్యం 1. 50 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా, ముద్ర ద్వారా పాడి పరిశ్రమ రుణాలకు ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో నిర్మల్, కడెం, భైంసాలో పాలశీతలీకరణ కేంద్రాలు నడుస్తున్నాయని త్వరలో దేగామ, కల్లూర్లోనూ ప్రారంభిస్తామని చెప్పా రు. కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో జిల్లా డెయి రీ కేంద్రంలో త్వరలో మినరల్ మిక్చర్ తయారీ కేంద్రం, పాల ప్యాకింగ్ కేంద్రం, దూడల పెంప కం లాంటి వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విజయ పాలను అందిస్తున్నట్లు తెలిపారు.