కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధిని ఎనిమిదేండ్లలో చేసి చూపించారు..” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ స్పష్టం చేశారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో 11 వార్డుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్ తారక వాణి-రఘు దంపతులు 500 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ఏర్పాటు వల్ల విద్య, వైద్యం అభివృద్ధి చెందాయన్నారు. రహదారులు విశాలంగా మారాయని, అనేక భవనాలను నిర్మించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రెండు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశామని, మరో రెండు వేలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నిర్మల్-ఆర్మూర్ రైల్వే లైన్కు కేంద్రం ఎందుకు నిధులు మంజూరు చేస్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
– నిర్మల్ అర్బన్, మే 6
నిర్మల్ అర్బన్, మే 6 : దేశంలోని అన్ని రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజన్తో పని చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో పట్టణంలోని 11 వార్డులకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్ తారక వాణి-రఘు దంపతులు 500 మంది కార్యకర్తలతో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చి పూర్వవైభవం తీసుకువచ్చామన్నారు. 60 ఏండ్ల నుంచి ఏ నాయకుడు చేయలేని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూపెట్టామన్నారు. నిర్మల్ పట్టణంలో గతంలో 10 వేల జనాభా ఉండే. ఇప్పుడు 1.50 లక్షలు దాటింది. పట్టణ జనాభాను దృషిలో ఉంచుకుని చైన్గేట్-బంగల్పేట్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. శివాజీచౌక్ నుంచి చించోలి వరకు, శివాజీచౌక్ నుంచి కొండాపూర్ వరకు, శివాజీచౌక్ నుంచి మంజులాపూర్ వరకు, శివాజీచౌక్ నుంచి కడ్తాల్ బైపాస్ వరకు సెంట్రల్ లైటింగ్, విశాలంగా రోడ్లను ఏర్పాటు చేసి ఆర్చ్లు, ఫౌంటేయిన్, ఫుట్పాత్లను ఏర్పాటు చేశామని అన్నారు.
డబుల్ బెడ్రూంలను పంపిణీ చేశాం..
నిర్మల్ జిల్లా ఏర్పాటు వల్ల విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. జూనియర్ కళాశాలు, కేజీబీవీ భవనాలు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, మెడికల్ కళాశాల, 350 బెడ్స్తో జిల్లా ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, నూతన సమీకృత కలెక్టరేట్తో అనేక భవనాలను నిర్మించుకున్నామని గుర్తు చేశారు. ఇండ్లు లేని వారికి 2 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశామని, మరో 2వేలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి నియోజకవర్గంలో 3వేల మందికి రూ.3 లక్షల నగదును అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నగదును లబ్ధిదారులు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మూడోసారి కేసీఆర్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చించోలి వద్ద మైనార్టీలకు స్థలాన్ని కేటాయిస్తే కొందరు బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
మహిళల కష్టాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ మాత్రమే వారికి కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం సహకరించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. నిర్మల్-ఆర్మూర్ రైల్వే లైన్కు కేంద్రం ఎందుకు నిధులు మంజూరు చేస్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.