సోన్, జూలై 19: వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడం రైతులను ఆగం చేసే కుట్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. బుధవారం నిర్మల్ జిల్లా సోన్లోని రైతు వేదికలో ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల కరెంట్ను నిరంతరంగా కొనసాగించాలని కోరుతూ రైతుల పక్షాన చేసిన తీర్మానంపై మంత్రి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగెస్ హయాంలో 9 గంటల కరెంట్తో పగటి పూట నాలుగు, రాత్రి ఐదు గంటలతో రైతులు రాత్రి పగలు తేడాలేకుండా పంట పొలాలకు వెళ్లి నీరు పెట్టేందుకు పోయి పాములు, తేళ్లు కుట్టి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల్లో మూడు ఎకరాలు పారుతుందనే విషయాన్ని చెప్పాడని చురకలంటించారు.
రైతులను కించపరిచే విధంగా మాట్లాడినందున కాంగ్రెసోళ్లు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల పొలానికి వెళ్లి మోటర్ వేసి ఇంటికొస్తే పంట పండుతోంది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కావాలో… మూడు గంటల కరెంట్ గురించి మాట్లాడిన కాంగ్రెస్ కావాలో ప్రజలే నిర్ణయించుకొని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని సూచించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో మరింత ఆ పార్టీ దిగజారిందన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజలు, నాయకులు అప్రమత్తంగా ఉండి పని చేసే ప్రభుత్వానికి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎఫ్ఎసీఎస్ చైర్మన్ రాజేందర్, ఎఫ్ఎసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి, సర్పంచ్ వినోద్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజేశ్వర్, ప్రసాద్, గంగారెడ్డి, గంగాధర్, కాంతయ్య పాల్గొన్నారు.
కరెంట్ గురించి రంది లేదు..
సోన్, జూలై 19: కరెంట్ 24 గంటలు వచ్చిన తర్వాతనే మా కష్టాలు తీరాయి. కాంగ్రెస్ హయాంలో 9 గంటల కరెంట్ ఉండే. అది ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో తెలిసేది కాదు. కరెంట్ కోసం పంట పొలాల వద్ద కండ్లు కాయలు కాసేలా చూసేవాళ్లం. వచ్చిన కరెంట్ సక్రమంగా ఉండేది కాదు. దీంతో మోటర్లు, స్టాటర్లు కాలిపోయేవి. కరెంటోళ్లకు ఫోన్ చేస్తే ఎవరూ పట్టించుకోపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల పొలంలో ఎప్పుడు చూసినా నీళ్లే. ఐదారు ఎకరాల వరకు పంటలు వేసుకుంటున్నాం. ఒక ఎకరం కూడా ఎండుతలేదు. బావి వద్దకు వెళ్లి మోటరు స్టాట్ చేసి వస్తే తెల్లరేసరికి పారుకం దిగుతోంది. ప్రతి గుంటను వదలకుండా పంటను పండిస్తున్నాం. కరెంట్ గురించి రంది లేదు. కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ ఇస్తమంటే ముందుగా మేము కూడా నమ్మలేం. ఇప్పుడు ఇస్తున్నది చూసి మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంగ్రెసోళ్లు కరెంట్ ఇవ్వడం చేతకాలే.. ఇప్పుడు కరెంట్పై ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్పాలే.
-లింగన్న, రైతు, సాకెర, సోన్ మండలం
కాంగ్రెస్ హయాంలో తిప్పలు పడ్డాం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 గంటల కరెంట్ ఇస్తే ఎన్నో తిప్పలు పడ్డాం. రాత్రుల్లో పంటలకు నీరు పెట్టేందుకు ప్రాణాలకు భయపడి పనులు చేసుకున్నాం. సీఎం కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వచ్చాయి. పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ సరఫరా అవుతున్నది. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ గురించి మాట్లాడుతున్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చేటోళ్లకు ఊర్లో ఏ ఒక్కరూ ఓటు వేయం. వాళ్లకు ఓటు వేస్తే మళ్లీ మూడు గంటల కరెంట్ వస్తది. మా పంటలు ఎట్ల పండుతాయి. మనమంతా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ సార్కు ఓటు వేద్దాం.
-సలుగంటి లింగన్న, రైతు, సోన్
రైతులకు మంచి రోజులు
దస్తురాబాద్, జూలై 19 : కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. విత్తనాలు, ఎరువులు లేక చాలా నష్టం పోయాం. కరెంట్ సరిగా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయి. 24 గంటలు కరెంట్ అందిస్తూ, రైతుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నది. కరెంట్ కోసం ఎదురు చూసే పని లేకుండా పోయింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేదు. రైతు కండ్లలో ఆనందం ఉంది.
-శివలాల్,రైతు, మున్యాలతండా
కరెంట్ కష్టాలు లేవు..
దస్తురాబాద్,జూలై 19 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషితో రైతులందరం సంతోషంగా ఉన్నాం, రెప్పపాటు కరెంట్
పోతాలేదు. నీళ్లు ఉండడంతో సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. రైతులు అభివృధ్ధి చెందుతున్నారు. రైతు రాజ్యం రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సంక్షేమం కోసం పాటుపడుతుండడంతో రైతులు ముందుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలు ఆనడం దారుణం. కాంగ్రెస్ పాలనలో చాలా నష్ట పోయాం. కరెంట్ సరఫరా లేక పంటలు సరిగా పండేవి కావు. ఇప్పుడు అలాంటి తిప్పాలు లేవు.సీఎం కేసీఆర్ ఆ బాధలు లేకుండా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుండు. మునుపటి కష్టాలు మాకోద్దు.
-మావురికారి రాయపోశం,రైతు,ఆకొండపేట