నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో గురువారం శోభాయాత్రలు నిర్వహించగా.. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతీ యువకులు భాజా భజంత్రీల మధ్య నృత్యాలు చేశారు. మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. నిర్మల్ పట్టణంలోని నిమజ్జన శోభాయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఉట్నూర్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆయా చోట్ల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసి.. డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 28 : తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడి శోభాయాత్రను గురువారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ కాలనీలో గల గణనాథుడికి కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, ట్రాక్టర్ నడిపి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణంలో 300 వరకు గణనాథులను ప్రతిష్ఠించారని, ఉత్సవ శోభాయాత్రను ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉత్సవ సమితి, పోలీసులు సూచనలు పాటిస్తూ శోభాయాత్రను నిర్వహించాలని అన్నారు.
ఉత్సవ సమితి అధ్యక్షుడు ముప్పిడి రవి, సభ్యులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి-దివ్యారెడ్డిలను శాలువాతో ఘనంగా సన్మానించారు. శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎస్పీ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్ఐలు, భద్రతా దళాలు నిఘాను పటిష్టం చేశారు. దాదాపు 100 సీసీ కెమెరాలను కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాము, కౌన్సిలర్ నేరేళ్ల వేణు, ఎస్పీ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు.
శోభాయాత్ర స్ఫూర్తిదాయకం
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28 : ఆదిలాబాద్ పట్టణంలోని శిశు మందిర్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి శోభాయాత్రను కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. యేటా హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక శోభాయాత్రను నిర్వహిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా కొనసాగేలా చేయడం అభినందనీయమని అన్నారు.