నిర్మల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ‘బండీ.. నీ తొండి మాటలు ఆపు.., ఇక్కడి ప్రజలు చీదరించుకుటున్నారు.., అబద్ధాలతో మభ్యపెట్టలేవు..’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నిర్మల్లో చేపట్టిన పాదయాత్రలో పూర్తి అవాస్తవాలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవాం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునే హక్కు అందరికీ ఉన్నదని, అంతమాత్రానా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదన్నారు.
నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ను పట్టుకొని దొంగ దీక్ష చేశారని మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కవితను జైలుకు పంపుతావా..? చట్టం నీ జాగీరా..? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. తాను 2వేల ఎకరాలు కబ్జా చేశానని ఆరోపించారని అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికుల నియామకంలో డబ్బులు తీసుకున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు.
వారం గడువు ఇస్తున్నానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా..? అని సంజయ్ని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉండి, అవినీతికి పాల్పడకుండా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నామన్నారు. ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదని తెలిపారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు తమకు రావన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి సీఎం, సీఎం కుటుంబ సభ్యులను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. బీజేపీ నాయకులను ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగాయా అని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నిధులు రాకపోగా, పథకాల్లోను అన్యాయం జరుగుతోందన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ‘ప్రసాద్’ పథకంలో బాసర దేవాలయాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్రను భైంసా నుంచి ప్రారంభించారని, దగ్గరలోనే ఉన్న బాసరకు వెళ్లేందుకు ఆయనకు ముఖం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాసరలో రూ.50కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సైన్స్ సెంటర్కు నిర్మల్లో ఐదెకరాలు కేటాయించినప్పటికీ, నేటికి అనుమతులు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలో పాల్గొంటున్నాడో అర్థం కావడంలేదన్నారు. ఆదిలాబాద్కు ట్రైబల్ యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారని కేంద్రంపై మండిపడ్డారు.
ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్ పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో చేపట్టే ఏ ప్రాజెక్టులకూ కేంద్రం నుంచి సహకారం అందడం లేదని, రాష్ట్ర నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగితే నయా పైసా ఇవ్వలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి, తెలంగాణకు ఇంకో నీతి ఎందుకని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడంతో బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు పెరిగాయని, వాటికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మాదిరిగా విభజన రాజకీయాలు చేయబోమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, నాయకులు రాంకిషన్రెడ్డి, మారుగొండ రాము, ధర్మాజీ రాజేందర్, చిలుక రమణ, డా సుభాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.