బెల్లంపల్లి రూరల్, జనవరి 7: కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మరో ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే ప్రమాదమున్నది.
మారుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ రైతులకు పంటల జాగ్రత్తలపై పలు సూచనలు అందించారు. చలికాలం రైతులు తీసుకునే జాగ్రత్తలే పంటలకు శ్రేయస్కరమని చెబుతున్నారు. వరి, మొక్కజొన్న, మిరప, శనగ, జొన్న, వేరుశనగ పంటల సాగులో పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం నారుపోసే రైతులు ఎకరానికి సరిపడే నారుమడి ఆఖరి దుక్కిలో 500 గ్రాముల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. బాగా మాగిన పశువుల ఎరువును 400 కిలోలు, లేదా కోళ్ల ఎరువు 200 కిలోలు ఎకరానికి సరిపోయే నారుమడిలో వేసుకోవాలి. ఈ ఎరువులు వేసుకోవడం వల్ల పంట చలిని తట్టుకోవడంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్ ఐరన్ బాగా లభ్యమవుతాయి. అదే విధంగా రాత్రి వేళల్లో నీటిని నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీటిని పెట్టుకోవాలి.
ఒక అడుగు ఎత్తులో వెదురు కర్రలను అమర్చి దాని మీద పాలిథిన్ షీట్ లేదా టర్పాలిన్స్ సాయంత్రం వేళల్లో కప్పి ఉదయం తీసివేయాలి. ప్రస్తుత వాతావరణంలో వరినారు మళ్లలో అగ్గి తెగులు ఆశించే అవకాశాలున్నాయి. అగ్గి తెగులును గమనించినట్లయితే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్1.5 మిల్లీ లీటర్లు లేదా కాస్గామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి నారులో జింక్ దాతు లోప లక్షణాలు గమనించినట్లయితే 2 గ్రాముల సల్పేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుతమున్న వాతావరణంలో వరి మాగాణుల్లో వేసిన మొక్కజొన్న పంటల్లో భాస్వరం లోప లక్షణాలుంటే ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. వీటి నివారణకు 10 గ్రాముల 19:19:19 లేదా డీఏపీని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అధికంగా కత్తెర పురుగు సోకే అవకాశాలు కూడా ఉండడంతో దీని నివారణకు 0.3 మి.లీ క్లోరాంతనిప్రోల్ లేదా 0.5 మి.లీ స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి సుడిలో పడే విధంగా పిచికారీ చేయాలి.
మిరపలో తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున దీని నివారణ కోసం ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పిప్రోనిల్ 2 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపకు కాయకుళ్లు తెగులు కూడా ఆశించే అవకాశం ఉన్నందున ఎక్కడైనా దీన్ని గమనిస్తే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజేబ్ లేదా 1మి.లీ పోర్పికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
శనగ పంటలో శనగపచ్చ పురుగు ఆశించే ప్రమాదం ఉంది. శనగపచ్చ పురుగు నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జొన్న పంటలో పెనుబంక పురుగు గమనించినట్లయితే 2.మి.లీ మిథైల్ డెమాటాన్ లేదా డైమిథోయేట్ లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
వేరుశనగ పంటలో పొగాకు లద్దె పురుగు సోకేందుకు అవకాశం ఉన్నందున ముందుగా ఎక్కడైనా చిన్న చిన్న పురుగులున్నట్లు గమనిస్తే 5 శాతం వేప కషాయం లేదా 5 మి.లీ వేప నూనె(అజాడిరెక్టిన్)లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో లార్వా ఎదిగినట్లయితే 200 మి.లీ నోవల్యురాన్ లేదా 40 మి.లీ ఫ్లూబెండమైన్ ఎకరానికి సరిపోయేలా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. తిక్క ఆకుమచ్చ తెగులు గమనిస్తే 2 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రాము టిబ్యుకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదలు కుళ్లు తెగులు గమనిస్తే 2 గ్రాముల కార్బన్డిజం, మాంకోజెబ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.