ఉట్నూర్, అక్టోబర్ 22: మానవ శరీరంలో కిడ్నీల పాత్ర కీలకం. చెడు రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి అవయవానికి పంపడం విధి. దీనికి చికిత్స అనేది అతి ఖరీదైనది. కచ్చితంగా డయాలసిస్ చేసుకోవాలి. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇటువంటి పరిస్థితులను గుర్తించిన సర్కారు ఏజెన్సీలోని కిడ్నీ రోగులకు 2018 సంవత్సరంలో ఉట్నూర్లోని దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన 39 మంది రోగులు ఉట్నూర్ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.
వీరు గతంతో కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టుకుంటు రక్తాన్ని శుద్ధి చేయించుకునే వారు. ప్రభుత్వం ఉట్నూర్ వంటి చిన్న పట్టణాల్లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, కడెం, ఖానాపూర్, కెరమెరి, జైనూర్, నార్నూర్ ప్రాంతాల రోగులకు వైద్యం అందుతోంది. ప్రభుత్వ ఖర్చుతో 39 మందికి వారంలో మూడు సార్లు రక్తం శుద్ధి చేస్తున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు స ర్కారు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తోంది.
కిడ్నీ చెడిపోయి చాలా ఇబ్బందులు పడ్డా. సుమారు నాలుగేండ్లుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రక్తశుద్ధి చేయించుకున్న. ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి ఇక్కడనే రక్తం శుద్ధి చేయించుకుంటున్న. ఆదిలాబాద్కు పోయి రావాలంటే డబ్బులు బాగా అయ్యేవి. నా వెంట ఒకరిని తీసుకుపోవాల్సి వచ్చేది. గిప్పుడు పైసలు, మనుషుల బాధ తప్పింది.
-సావిత్రి బాయి, ఉట్నూర్
కిడ్నీలు పాడైనొళ్ల గోస మామూలుగా ఉండది. రక్తం మొత్తం మిషన్లకు పోయి శుద్ధి అయి మళ్ల శరీరానికి వస్తది. ఇట్లా వారంలో మూడు సార్ల చేయించుకోవాలే. మేము ఉన్న లేకున్నట్లుగా ఉంటది. మా గోస ప్రభుత్వం పట్టించుకుంది. అందుకే మాకు దగ్గర డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసింది. లేకుంటే సిటీకి పోయి ఖర్చు పెట్టుకొనే స్థోమత మాకు లేదు.
– రోషన్, ఇంద్రవెల్లి