ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన(మార్చి 8న) ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు ప్రభుత్వ వైద్యశాలల్లో అమలవుతుండగా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఇప్పటివరకు 22,176 మంది వైద్యానికి వచ్చారు.
– ఆదిలాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం కోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత నివారణ, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంపొందించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు.., తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నది. సర్కారు దవాఖానల్లో వైద్యులు గర్భిణులకు క్రమంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో ఐదు ప్రభుత్వ దవాఖానల్లో (బజార్హత్నూర్, జైనథ్, శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆదిలాబాద్ పట్టణంలోని హమాలీవాడీ, పుత్లీబౌళీ, అర్బన్ హెల్త్ సెంటర్) ప్రతీ మంగళవారం మహిళలకు వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలోని ఐదు ఆరోగ్య మహిళా దవాఖానల్లో పలు వ్యాధుల నిర్ధారణ, చికిత్స అందిస్తున్నారు. గర్భాశయం, నోటి, రొమ్ము క్యాన్సర్లు స్క్రినింగ్, థైరాయిడ్, మోనోపాజ్ సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు, కడుపులో ఇన్ఫెక్షన్లు, రుతుస్రావ, అధిక బరువు లాంటి సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో దవాఖనాలకు వచ్చే వారి శాంపిళ్లు సేకరించి, టీ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. అక్కడ సిబ్బంది పరీక్షలు నిర్వహించి, రిపోర్టును తిరిగి దవాఖానకు చేరవేస్తారు. వాటి ఆధారంగా వైద్యులు మహిళలకు అసరరమైన చికిత్స అందిస్తారు. పుత్లీబౌళీ అర్బన్ హెల్త్ సెంటర్, జైనథ్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించింది. దీంతో జిల్లాలో ఈ కేంద్రాల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే ఈ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో దవాఖానలకు వచ్చి, వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఐదు దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండడంతో సర్కారు వైద్యం మహిళలకు మరింత చేరువ కానున్నది.
ప్రభుత్వం జిల్లాలో ఐదు ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యమహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళలకు 8 రకాల వైద్యసేవలు అందిస్తున్నది. రిమ్స్లో సేవా కేంద్రం ఏర్పాటు చేసి, ముగ్గురు సిబ్బందిని నియమించింది. వారు వివిధ విభాగాలకు తీసుకుపోయి వైద్య సేవలు అందిస్తారు. హైదరాబాద్ దవాఖానల్లో సైతం మహిళలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి మంగళవారం వీటిల్లో మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన చికిత్స అందచేస్తున్నారు. ఈ కేంద్రాల్లో మహిళా వైద్యులతో పాటు సిబ్బంది ఉంటారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా తెలయజేసే అవకాశం ఉంది. జిల్లాలో ఈ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అన్ని రకాల వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతీ మంగళవారం దవాఖానలో మహిళా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరీక్షలు, మందులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఫలితంగా మహిళలు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించి, అవసరమైన వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. మంచి వైద్యం అవసరమైన వారికి ఇతర దవాఖానలకు పంపిస్తున్నారు.
– దుగ్గన లక్ష్మి, ఆదిలాబాద్