మంచిర్యాల అర్బన్/శ్రీరాంపూర్, ఫిబ్రవరి 18 : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న బస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. వేర్వేరు కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల మైదానం, శ్రీరాంపూర్ కాలనీ నుంచి ఏర్పాటు చేసిన బస్సులకు పూజలు చేసి, జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 365 బస్సులను మేడారం జాతరకు నడిపిస్తున్నట్లు తెలిపారు. శ్రీరాంపూర్ కాలనీ నుంచి 45 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మంచిర్యాల పట్టణ సమీప గోదావరి తీరంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీసీసీలో సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించగా, వెంట నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, కౌన్సిలర్లు పూదరి కుమార్, మహేశ్, ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్, డీఎం అమృత, డిప్యూటీ డీఎంలు ప్రణయ్, ప్రణీత్, నాయకు గెల్లు మల్లేశం, ధర్ని మధూకర్, ఖాలీద్, సీపతి మల్లేశం, కొంతం రమేశ్, సురేశ్ ఉన్నారు. సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద జాతర పనులను కూడా పరిశీలించారు.
చెన్నూర్, ఫిబ్రవరి 18: చెన్నూర్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. చెన్నూర్ నుంచి 110 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించగా, పురుషులు పెద్దలకు రూ. 410, పిల్లలకు రూ. 220 చార్జీలను వసూలు చేయనున్నారు. రద్దీని బట్టి అదనంగా మరిన్ని బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, రీజినల్ మేనేజర్ సులేమాన్, మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్, కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.