మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎంసీసీ క్వారీ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. దుర్గాదేవితో పాటు నాగదేవతను దర్శించుకొని.. సల్లంగా సూడు తల్లీ.. అంటూ వేడుకున్నారు. పలువురు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి.. అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దంపతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోగా, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
– హాజీపూర్, జూలై 9
హాజీపూర్, జూలై 9 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎంసీసీ క్వారీ జాతర ఆదివారం వైభవంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలు కాగా.. పది గంటల తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాలీల్లో తరలివచ్చి దుర్గాదేవితో పాటు నాగదేవతకు మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను సల్లంగా సూడు తల్లీ.. అని వేడుకున్నారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం అక్కడే సామూహిక భోజనాలు చేశారు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో వేణు, ఆలయ చైర్పర్సన్, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే జాతరంతా తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేశారు.