తానూర్, అక్టోబర్ 16 : తానూర్ మండలంలోని 20 గ్రామాల్లో బంతిపూలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయా, ఇతర పప్పు దినుసుల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు బంతిపూల సాగుకు మొగ్గు చూపారు. ఎకరంలో బంతి పూలను సాగు చేస్తే రూ. 50 వేల దాకా ఖర్చు అవుతుంది. ఒక్కో ఎకరానికి 2 టన్నుల దిగుబడి వస్తుంది. కిలోకు రూ. 100 చొప్పున విక్రయించినా, 2 టన్నులకు రూ. 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. కేవలం 75 రోజుల పంట కావడంతో రైతులు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. మూడేళ్ల క్రితం తానూర్ మండలంలో ఒకరిద్దరు రైతులు మాత్రమే బంతి పూలు సాగు చేయగా, ఈ యేడు 50 మందికి పైగా రైతులు 15 ఎకరాల్లో సాగు చేశారు.
దీపావళికి డిమాండ్..
ఈ నెల 24న దీపావళి పండుగ నేపథ్యంలో రైతులు బంతిపూలను తెంపి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ రోజు ఇండ్లతో పాటు వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో పూజల కోసం వీటిని వినియోగించనుండగా, మార్కెట్లో మంచి ధర పలికే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంతి పూలకు కిలో రూ. 120 నుంచి రూ. 150 వరకు అమ్ముతున్నారు. దసరా పండుగ సందర్భంలో కొందరు తోట వద్దే విక్రయించారు. కిలో రూ.100కి చొప్పున అమ్మారు. మరికొందరు భైంసా, నిజామాబాద్, నిర్మల్తో పాటు మహారాష్ట్రలోని భోకర్, నాందేడ్ మార్కెట్లకు తరలించారు. పొలం వద్ద మార్కెట్ కన్నా తక్కువ రేటుకు ఇస్తుండడం.. పూలు తాజాగా ఉంటుండడంతో వినియోగదారులు అక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఎకరానికి 2 టన్నుల దిగుబడి
యేటా పత్తి, సోయా, ఇతర పంటలు సాగు చేసేటోన్ని. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి.. లాభం లేకుంటైతందని ఈ ఏడాది ఎకరంలో బంతి పూలు సాగు చేసిన. రూ. 50 వేల దాకా ఖర్చు చేసిన. 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. దీపావళి పండుగకు మార్కెట్లో అమ్ముత. రైతులు పూల సాగుపై దృష్టి సారిస్తే మంచిది.
– బద్రి సాయినాథ్, రైతు, తానూర్