మంచిర్యాల, మార్చి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బాధితులు, వారి తరఫు అడ్వొకేట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని 479, 480 సర్వే నంబర్లలో అజ్మీరా బేగం అనే మహిళకు 23 ఎకరాల 27 సెంట్ల భూమి ఉంది. 1982లో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని మల్బరీ ప్లాంటేషన్ కోసం సేకరించింది. బాధితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు చెల్లించాలంటూ ఎన్ని దరఖాస్తులు చేసినా అప్పుడున్న ఆర్డీవో పట్టించుకోకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ప్రభుత్వం అసలు అజ్మీరా బేగం ఆ భూమి యజమానే కాదంటూ కోర్టుకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై న్యాయపోరాటం చేసిన బాధితులు ఆసిఫాబాద్ జిల్లా కోర్టులో భూమికి ఓనర్లుగా డిక్లేర్ అయ్యారు. కానీ.. ఆర్డీవో కార్యాలయ అధికారులు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ బాధితులు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. ఇలా ఎన్నో సంవత్సరాల న్యాయపోరాటం అనంతరం 2007లో అప్పటి కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బాధితుల తరఫు అడ్వొకేట్ పసుల సురేశ్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం రూ.2.92 కోట్లు చెల్లించాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారన్నారు.
చివరకు 2017లో బాధితులు మరోసారి హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. అనేక వాదోపవాదనల అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేసు మంచిర్యాల సబ్ కోర్టుకు చేరిందన్నారు. హైకోర్టులో కేసును డిస్మిస్ చేసిన దృష్ట్యా బాధితులకు డబ్బులు చెల్లించాల్సిందేనంటూ ఆర్డీవోను సబ్కోర్టు ఆదేశించిందన్నారు. ఇందుకోసం మూడు నెలల సమయం ఇస్తూ అక్టోబర్లో ఫైనల్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. మూడు నెలల్లో డబ్బులు చెల్లించకపోతే ఆర్డీవో కార్యాలయ ఆస్తులు అటాచ్ చేస్తామని ఆర్డర్లో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం, వారి నుంచి కనీస స్పందన లేకపోవడంతో కార్యాలయ ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది వచ్చినట్లు ఆయన తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఆర్డీవో కార్యాలయంలోని చరాస్తులను జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది వచ్చా రు. కొన్ని కుర్చీలు, టేబుల్స్, కంప్యూటర్లకు కేసు నంబర్, ఇతర వివరాలను అంటించారు. సీరియల్ నంబర్ల వారీగా వస్తులను బయటికి తీసుకొచ్చి ఆ వివరాలను నోట్ చేసుకున్నారు. కానీ.. ఉన్నట్టుండి పైనుంచి ఆదేశాలు వచ్చాయంటూ అప్పటి వరకు చేసిన పనిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధితులు, వారి తరఫు న్యాయవాది ఎవరు ఆపమన్నారో వివరంగా ఒక పేపర్పై రాసిచ్చి వెళ్లాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఆర్డీవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన వే రే మార్గం గుండా బయటికి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఆర్డీవో వెళ్లిపోయిన అనంతరం బాధితులు మాట్లాడుతూ.. అజ్మీరా బేగం వయసు ఇప్పుడు 93 ఏండ్లని ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంత మా త్రంగానే ఉందన్నారు. 42ఏండ్లుగా న్యాయం కోసం చేస్తు న్న పోరాటానికి ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పరిహారం ఎప్పుడు ఇస్తారో నోటి మాట గా కాకుండా ఒక పేపర్పై ఇవ్వాలని కోరితే ఆర్డీవో తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కలెక్టర్ చెప్పంది తాను ఇవ్వలేనని ఆర్డీవో చెప్పారని, కోర్టు ఆర్డర్ ఇచ్చాక మళ్లీ ప్రత్యేకంగా కలెక్టర్ చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తమకు అర్థంకావడం లేదని వాపోయారు. కా గా.. ఈ విషయంలో కనీస బాధ్యత లేకుండా ఆర్డీవో, కా ర్యాలయ సిబ్బంది వ్యవహరించడం, మీడియా చూస్తుండగానే అనేక నాటకీయ పరిణామాల మధ్య జప్తును ఆపేసి వెళ్లడానికి కారణాలు ఏంటనేది తెలియరాలేదు.