ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం వందల కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. కొత్త రోడ్లు వేయడం అటుంచి.. పాత వాటికీ కనీస మరమ్మతులు లేక నిత్యం నరకప్రాయంగా ఉండేది.. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చొరవతో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకూ రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తుండగా, ప్రయాణం సాఫీగా సాగుతున్నది. రవాణా సౌకర్యం మెరుగుపడడంతో ప్రజానీకం అలసట లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నది. గంటకు 60 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుండగా, సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతున్నది. ఇక గోదావరి నది, వాగులపై నిర్మించిన వంతెనలతో దూరం తగ్గడమేగాక నేరుగా పక్క జిల్లాలు, రాష్ర్టాలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రూ.347.88 కోట్లతో 82 బ్రిడ్జిలు, 303 కిలో మీటర్ల మేర రోడ్లు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ. 148.50 కోట్లతో రెండు వరుసల రహదారులు నిర్మించగా, ‘నమస్తే తెలంగాణ’అందిస్తున్న ప్రత్యేక కథనం.
– మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ )
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మారుమూల మండలం బెజ్జూరు… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 190 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. బెజ్జూరు నుంచి ఆదిలాబాద్కు చేరుకోవడానికి 7 నుంచి 8 గంటలు పట్టేది. ఇరుకిరుకు.. గుంతలమయమైన రోడ్లపై అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. తిరిగి బెజ్జూర్కు అదే రోజు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరుసటి రోజు పయనమై సాయంత్రానికల్లా ఇళ్లకు చేరుకునే దుస్థితి ఉండేది. ఇదంతా గతం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారులు నిర్మించడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ వెళ్లిన ప్రయాణికులు తిరిగి అదేరోజు సాయంత్రానికల్లా ఇళ్లకు చేరుకోగలుగుతున్నారు. బెజ్జూర్ మండల కేంద్రం నుంచి సిర్పూర్కు 52 కిలోమీటర్లు ఉండగా, ప్రభుత్వం రూ. 62 కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మించింది. నాడు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వాహనాలు.. నేడు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి. గమ్యస్థానాలకు వెళ్లే సమయం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతోంది.
రూ.148.50 కోట్లతో రెండు వరుసల రోడ్లు
ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారులు ఉండాలని భావించిన ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.148.50 కోట్లతో తిర్యాణి, బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, సిర్పూర్-టీ మండలాలకు రెండు వరుసల రహదారులు మంజూరు చేసింది. ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్కు వరకు 61 కిలోమీటర్ల మేర రూ. 63 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది. గతంలో ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్కు వెళ్లాలంటే ఒక రోజంతాపట్టేది. ఇరుకైన రహదారిపై వెళ్లాలంటే వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఈ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే వాహనాన్ని రోడ్డుదించలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్కు రెండు వరుసల రహదారి నిర్మాణంతో వాహనదారుల సమస్యలు తీరిపోయాయి. రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ. 187.83 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ రూ. 378.19 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది. రోడ్లు, వంతెనల నిర్మాణాలతో గ్రామీణ రవాణా వ్యవస్థలో సమూలంగా మార్పులు జరిగాయి.
రూ. 15.95 కోట్లతో జోడెఘాట్కు డబుల్ రోడ్డు..
కెరమెరి మండలం హట్టి గ్రామం నుంచి జోడెఘాట్ సుమారు 23 కిలోమీటర్లు ఉంటుంది. నాడు సరైన రోడ్డు వసతి కూడా ఉండేది కాదు. జోడెఘాట్తోపాటు మార్గమధ్యంలో ఉన్న 12 ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా కెరమెరి మండల కేంద్రానికి వెళ్లాలంటే వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం రూ. 15.95 కోట్ల తో రెండు వరుసల రహదారి నిర్మించింది. పిట్టగూడ, టోకెన్మోవాడ్, బా బెఝరి, శివగూడ, కొలాంగూడ, చిన్నపాట్నాపూర్, పాట్నాపూర్, గోపర, లైన్పటార్, పాఠగూడ, చాల్బడి గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. గతంలో తమ అవసరాల దృష్ట్యా మండల కేంద్రానికి కాలినడక, ఎడ్ల బండ్లపైనే వెళ్లేవారు. దశాబ్దాలపాటు అష్టకష్టాలు పడ్డ గిరిజనులు ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే మండల కేంద్రానికి చేరుకోగలుగుతున్నారు.
పల్లె పల్లెకూ దారులు..
ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపుగా 90 శాతం గిరిజన గ్రామాలే.. ఈ గ్రామాలకు ఐటీడీఏ ద్వారా ప్రత్యేకంగా రూ. 188.97 కోట్లతో 200 గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించింది. అలాగే ప్రభుత్వం రూ. 305 కోట్లతో జిల్లాలో 52 హైలెవల్ వంతెనలను నిర్మించింది. ఒకప్పుడు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రావాలంటే సరైన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనులు ఇప్పుడు ఎంచక్కా రాకపోకలు సాగిస్తున్నారు.
మంచిర్యాల, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు మంచిర్యాల రావాలంటే రోడ్లపై నరకయాతన.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు ఒక్కరోజు వచ్చి తిరిగి వెళ్లలేక మరుసటి రోజు పోవాల్సిన దుస్థితి. గుంతలయమమైన రోడ్లతోపాటు రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండేవి. హైదరాబాద్కు వెళ్లాలంటే ఐదున్నర గంటలపాటు నరకం అనుభవించాల్సి వచ్చేది. కానీ..తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లను అద్దంలా మార్చడంతో ప్రయాణం ఎంచక్కా సాగుతోంది. అదే హైదరాబాద్కు నాలుగున్నర గంటల్లో చేరుకుంటున్నారు.
కరీంనగర్కు గతంలో రెండు నుంచి రెండున్నర గంటల ప్రయాణం.. కానీ ఇప్పుడు గంటన్నర అవుతున్నది. సమైక్య పాలనలో మన రోడ్లను పట్టించుకున్న నాథుడే లేదు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని మారుమూల పల్లెల్లో పరిస్థితి మరీ దారుణం. వర్షం వచ్చిదంటే వాగులు పొంగి ఊర్లకు ఊర్లు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాల్సిన పరిస్థితి. కానీ.. సీఎం కేసీఆర్ రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేనంతగా ఈ ఎనిమిదేళ్లలో వందల కోట్లు రహదారులకు కేటాయించారు. మారుమూల పల్లెలకు వెళ్లే దారుల్లో ఉన్న వాగులపై వంతెనలు నిర్మించారు. దీంతో గతంలో గంటకు సగటున 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వాహనాలు.. ఇప్పుడు గంటకు సగటున 60 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇది తెలంగాణ వచ్చాక సాధించిన విప్లవాత్మక విజయం. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’అందిస్తున్న ప్రత్యేక కథనం.
రూ.347.88 కోట్ల ఆర్అండ్బీ రోడ్లు..
మంచిర్యాల జిల్లాలో ఒక ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలోనే 2014 నుంచి ఇప్పటి వరకు రూ.347.88 కోట్లతో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 303 కిలోమీటర్ల రహదారితోపాటు, వాగులపై 82 బ్రిడ్జిలు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన పనులన్నీ కలిపితే జిల్లాలో దాదాపు రూ.1000 కోట్లు కేవలం రహదారుల అభివృద్ధి పైనే వెచ్చించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇందారం క్రాస్ రోడ్ నుంచి పాత మంచిర్యాల వరకు రూ.77 కోట్లతో జాతీయ రహదారిని విస్తరించారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.18 కోట్లు వెచ్చింది లక్ష్మీపూర్-వెంకట్రావ్పేట, ధర్మారావుపేట- నాగసముద్రం, వెల్గనూర్-కొమ్ముగూడెం, రెబ్బెనపల్లి, మోకాశిగూడ, మర్రిపల్లి దగ్గర కల్వర్టుల నిర్మాణం, ఇటిక్యాల దగ్గర వంతెన నిర్మించారు. రూ.8 కోట్ల అర్ అండ్ బీ నిధులతో టీకానపల్లి, వెంకట్రావ్పేట, లక్షెట్టిపేట, సీతారాంపల్లి గ్రామాలకు రహదారులు నిర్మించారు. దీంతో మండల ప్రాంతాల నుంచి గ్రామాలకు రవాణా సౌకర్యం మెగురుపడింది. దండేపల్లి నుంచి 30 నిమిషాలు, లక్షెట్టిపేట నుంచి 20 నిమిషాలు, హాజీపూర్, శ్రీరాంపూర్ నుంచి 10 నిమిషాల్లో నియోజకవర్గం చేరుకోవచ్చు. నియోజకవర్గం మొత్తం ఒక గంటలో తిరిగి రావొచ్చు.
బెల్లంపల్లిలో రోడ్లు ఇలా..
బెల్లంపల్లి నియోజకవర్గంలో వేమనపల్లి, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో విస్తృతంగా బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయి. వర్షాకాలంలో వాగులు పొంగి అనేక గ్రామాలతో సంబంధాలు తెగిపోయి రోజుల తరబడి ఇబ్బందులు పడేవారు. వేమనపల్లి మండలంలో రూ.8 కోట్లతో నీల్వాయి వంతెన నిర్శించారు. దీంతో 20 గ్రామాల ప్రజలు చెన్నూర్కు వెళ్లడానికి మార్గం సుగమమైంది. గొర్రెపల్లి వంతెనతోపాటు అవసరమున్న చోట బ్రిడ్జిలను ఏర్పాటు చేయడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. భీమిని మండలం ఎర్రవాగుపై డీఎంఎఫ్టీ రూ.4 కోట్లతో బ్రిడ్జి, భీమిని మండల కేంద్రం నుంచి పెద్దపేటకు వెళ్లే దారి మధ్యలో రూ.4 కోట్లతో పెద్దవాగు బ్రిడ్జి నిర్మించారు.
తాండూర్ మండలంలో గంపలపల్లి దగ్గర రూ.37 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. నెన్నెల మండలంలో ప్రజల సౌకర్యార్థం రూ.3 కోట్లతో కోనంపేట, కృష్ణపల్లి మార్గంలో మూడు బ్రిడ్జిలు నిర్మించారు. కాసిపేట మండలంలో దేవాపూర్,చింతగూడ గ్రామాల నడుమ సల్పలవాగు మధ్య, దేవాపూర్, గట్రావ్పల్లి వద్ద రాళ్లవాగు వంతెనలు నిర్మించారు. తాండూర్ మండలంలో రూ. కోటీ 80 లక్షలతో కొత్తపల్లి-కిష్టంపేట-ద్వారకాపూర్ బీటీ రోడ్డు నిర్మించారు. వేమనపల్లి మండలంలో రూ.11 కోట్లతో 4 కిలో మీటర్ల మేర మండల కేంద్రం నుంచి బుయ్యారం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. ప్రధానంగా కాసిపేట మండలంలో పెద్ద ధర్మారంవద్ద రూ.4 కోట్లతో రోడ్డు, దేవాపూర్లో రింగు రోడ్డు ఏర్పాటైంది. నెన్నెల మండలంలో 2016లో జంగాల్పేట వరకు బీటీ రోడ్డును నిర్మించారు.
భీమిని మండలంలో వెంకటాపూర్, తిమ్మాపూర్ నడుమ రోడ్డు నిర్మాణం పూర్తయింది. కన్నెపల్లి మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి పోలంపల్లికి, వీరాపూర్కు రోడ్డు నిర్మాణం చేశారు. దీంతో నియోజకవర్గ కేంద్రానికి నెన్నెల, భీమినిలాంటి మారుమూల మండలాల నుంచి అరగంటలో వెళ్లిపోగలుగుతున్నారు. కన్నెపల్లి మండలానికి 20 నిమిషాలు, తాండూర్, కాసిపేట మండలాల నుంచైతే 15 నిమిషాల్లో నియోజకవర్గ కేంద్రానికి వెళ్తున్నారు. గతంలో ఈ కొద్ది పాటి ప్రయాణాలకు చాలా సమయం పట్టేది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక నియోజకవర్గ కేంద్రానికి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమనపల్లికి వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ ఇప్పుడు గంటలో వెళ్లిపోతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో ఇలా…
చెన్నూర్ మండలంలోని బీరెల్లి నుంచి నాగాపూర్ గ్రామానికి కొత్తగా రూ 1.50 కోట్లతో 3 కిలోమీటర్లు రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం జరుగక ముందు బీరెల్లి ప్రజలు పొక్కూరు, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, ఆస్నాద్ మీదుగా నాగపూర్ గ్రామానికి వెళ్లేవారు. దీంతో వారు దాదాపు 20 కిలోమీటర్లు దూరం దాదాపు 40 నిమిషాలు ప్రయాణించాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీరెల్లి-నాగపూర్ గ్రామాల మధ్య కొత్తగా రోడ్డు నిర్మించడంతో మూడు కిలోమీటర్లను దాదాపు 10 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. అలాగే చెన్నూర్ పట్టణం నుంచి నారాయణపూర్, రాయిపేట గ్రామాల మధ్యన సుబ్బరాంపల్లి వాగు ఉంది.
ఈ వాగు రాకపోకలకు అడ్డంకిగా మారడంతో నారాయణపూర్ గ్రామ ప్రజలు దుగ్నెపల్లి, అంగ్రాజుపల్లి, కత్తరశాల గ్రామాల మీదుగా దాదాపు 17 కిలోమీటర్ల దూరంలోని చెన్నూర్కు 40 నిమిషాలు పట్టేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సుబ్బరాంపల్లి వాగుపై రూ.4.90 కోట్లతో వంతెన నిర్మించడంతో దూరం తగ్గింది. కేవలం 7 కిలోమీటర్లను 20 నిమిషాల్లో చేరుకుంటున్నారు. చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి ఎక్స్ రోడ్డు నుంచి గంగారం మీదుగా భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామం వరకు రూ.3 కోట్లతో రోడ్డు, రూ.1.15 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. దీంతో చెన్నూర్ మండలంలోని అస్నాద్, సోమనపల్లి, నాగపూర్, చాకెపల్లి, పొన్నారం, కొమ్మెర, పొక్కూరు, బీరెల్లి గ్రామాల ప్రజలు నేరుగా భీమారం మండలంలోని మద్దికల్, ఆరెపల్లి గ్రామాల మీదుగా భీమారం మండల కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కలిగింది.
ఈ రోడ్డు లేకముందు ఆయా గ్రామాల ప్రజలు అంగ్రాజుపల్లి, చెన్నూర్, కిష్టంపేట, భీమారం మీదుగా మద్దికల్, అరెపల్లి, కొత్తపల్లి గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా సమయం ఆదా అవుతున్నది. కోటపల్లి మండల కేంద్రానికి పంగిడిసోమారం గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. ఈ గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కోటపల్లి నుంచి పంగిడిసోమారం గ్రామానికి రూ. 4.75 కోట్లతో 8 కిలో మీటర్లు రోడ్డును నిర్మించారు. అలాగే మధ్యలో ఉన్న వాగుపై రూ.1.49 కోట్లతో వంతెన నిర్మించారు. దీంతో పంగిడిసోమారం గ్రామ ప్రజలకు రహదారి సౌకర్యం కలిగింది. ఈ రోడ్డు నిర్మాణం కాకముందు గ్రామ ప్రజలు కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా కోటపల్లికి చేరుకొని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అప్పుడు గ్రామం నుంచి కోటపల్లికి రావాలంటే వారికి దాదాపు గంటన్నర పట్టేది. రోడ్డు సౌకర్యం కలగడంతో ప్రస్తుతం వారు దాదాపు 30 నిమిషాల్లో కోటపల్లికి వస్తున్నారు.
అన్నారం బరాజ్తో…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెన్నూర్ మండలంలోని సుందరశాల గ్రామం వద్ద గోదావరి నదిపై వంతెనతో కూడిన బరాజ్ నిర్మించారు. దీంతో మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్, కాటారం మండలాల ప్రజలకు నేరుగా రవాణా సౌకర్యం కలిగింది. గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలకు బంధుత్వాలతో ఉండడంతో వీరంతా గోదావరి నదిలో నాటు పడవల ద్వారా నిత్యం రాకపోకలు సాగించేవారు. లేకపోతే వీరంతా శ్రీరాంపూర్, గోదావరిఖని, మంథని మీదుగా దాదాపు 100 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అన్నారం బరాజ్ నిర్మాణంతో కేవలం 30 కిలో మీటర్ల దూరంతో వీరంతా గోదావరి నది దాటి మహదేవ్పూర్, కాటారం మండలాలకు ప్రయాణిస్తున్నారు. అంతేగాకుండా.. చెన్నూర్ నుంచి భూపాలపల్లి, పరకాల, వరంగల్ పట్టణాలకు కూడా దూరం తగ్గడమేకాకుండా నేరుగా రవాణా సౌకర్యం కలిగింది.
ప్రయాణం సులువైంది..
35 ఏళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఒకప్పుడు మంచిర్యాల నుంచి హైదరాబాద్కు ఐదున్నర గంటలు పట్టేది. ఇప్పుడు నాలుగు, నాలుగున్నర గంటల్లోనే వెళ్లిపోతున్నాం. బెల్లంపల్లి, చెన్నూర్ నుంచి పోతే మరో అరగంట ఎక్కువ అవుతుంది. నాడు గుంతలు, కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రోడ్లన్నీ నాలుగు వరుసలయ్యాయి. సాఫీగా వెళ్లి రాగలుగు తున్నాం. ఒకప్పటితో పోలిస్తే ప్రమాదాలు సైతం తగ్గాయి. హైదరాబాద్ కైతే ప్రయాణ సమయం దాదాపు గంట తగ్గింది. మంచిర్యాల చుట్టూ ఎక్కడికి వెళ్లినా రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయి.
– కిసర రవీందర్, క్యాబ్ డ్రైవర్ (మంచిర్యాల)
రెండు గంటల్లో మంచిర్యాలకు..
గతంలో ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల వరకు రోడ్డు అధ్వానంగా ఉండేది. ప్రయాణం కష్టంగా సాగేది. 66 కిలోమీటర్లలో ఉన్న మంచిర్యాలకు వెళ్లాలంటే దాదాపు 3 గంటలు పట్టేది. తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డును బాగు చేయడంతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. డ్రైవింగ్ సులభతరమైంది. రెండు గంటల్లోనే మంచిర్యాలకు చేరుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లన్నీ మంచిగ అయినయ్.
– కుత్బోద్దీన్, ఆర్టీసీ డ్రైవర్, ఆసిఫాబాద్
ముందే చేరుకుంటున్నాం..
ఆసిఫాబాద్ నుంచి కాగజ్నగర్ మీదుగా కౌటాలకు బస్సు నడిపిస్తుంటా. గతంలో రోడ్లు బాగోలేకపోవడంతో చాలా ఇబ్బంది పడే వాళ్లం. కుదుపు లకు ప్రయాణికులు అవస్థలు పడేవారు. డ్రైవింగ్ చేస్తుంటే కూడా యాష్టకచ్చేది. బీఆర్ఎస్ సర్కారు కౌటాల వరకు రోడ్డు మంచిగ చేసింది. గతంలో సమయానికి చేరుకునేవాళ్లం కాదు. ఇప్పుడు రోడ్లు బాగు చేయడంతో నిర్దేశిత సమయానికి కంటే ముందుగానే చేరుకుంటున్నాం. ఇదంతా బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే సాధ్యమైంది.
– మల్లేశ్, ఆర్టీసీ డ్రైవర్, ఆసిఫాబాద్
బైకులు పాడయ్యేవి..
బెజ్జూర్ నుంచి కాగజ్నగర్ 70 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వరకు గుంతల రోడ్లపై బైకుపై ప్రయాణించాలంటే నరకంగా ఉండేది. 2 గంటలపైనే సమయం పట్టేది. అధ్వానమైన రోడ్డుతో బైకులు పాడయ్యేవి. సీఎం కేసీఆర్ రోడ్లు బాగు చేయించడం వల్ల అందరికీ మేలు జరుగుతున్నది. ఇప్పుడు బైక్పై కాగజ్నగర్కు గంటకు అటు.. ఇటుగా చేరుకుంటున్నాం. అట్లనే ఇది వరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి మూడు గంటలయ్యేది. ఇప్పుడు రెండు గంటల్లోనే వెళ్తున్నాం. రోడ్లు బాగు చేయడం వల్ల ప్రయాణం సులువు అయ్యింది.
– కుమ్మరి పురుషోత్తం, బెజ్జూర్
రోడ్లు బాగాలేవని చెప్పే పరిస్థితి లేదు
ఒకప్పుడు రోడ్లు అధ్వానంగా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లన్నీ మంచిగైనయ్. రోడ్లు బాగాలేవని చెప్పే పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ కొంత ఆలస్యం, అసౌకర్యం అనిపిస్తుంది. అవి పూర్తయితే ఎక్కడా ఆగాల్సిన పని కూడా ఉండదు. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్, కాగజ్నగర్ రోడ్డు అద్భుతంగా ఉంది. మంచిర్యాల సిటీ దాటితే 40 నుంచి 50 నిమిషాల్లో వెళ్లిపోతున్నాం.
– జనగామ బానేశ్, క్యాబ్ డ్రైవర్, మంచిర్యాల
అరగంట తగ్గింది
ఒకప్పుడు మంచిర్యాల నుంచి చెన్నూర్కు గంటన్నర పట్టేది. ఇప్పుడు రోడ్డు బాగవడంతో గంటలో పోతున్నాం. గతంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్ర యాణికుల సంఖ్య పెరిగింది. అంత కుముందు బస్సులో ఎక్కేవారు కాదు. ఇప్పుడు ఆక్యూపెన్సీ పెరిగింది. బస్సు ఖాళీగా రావడం లేదు. అన్ని గ్రామాల్లో ఆగుతూ, ప్రయాణికులను తీసుకెళ్తున్నాం. ఎక్స్ప్రెస్ అయితే 40 నిమిషాల్లో పోతున్నాం.
– జక్కుల సురేందర్, ఆర్టీసీ డ్రైవర్
రోడ్లన్నీ బాగున్నయ్
మంచిర్యాల జిల్లాలో రూట్లు అన్నీ బాగున్నయ్. వాహనాల మూమెంట్ పెరిగింది. ఇంతకు ముందులా ఇబ్బంది లేదు. ఆవడ-భీమారం- నెన్నెల రోడ్డు ఇంతకుముందు బాగాలేకుండే. బస్సు కూడా తిప్పలేకపోయాం. కానీ ఇప్పుడు ఆ రోడ్డు మంచిగైంది. కోటపల్లి మండలం జనగామ, వేమనపల్లి మండలంలో అంతకుముందు అన్నీ మట్టి రోడ్లే.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. చెన్నూర్ నుంచి కాటారం కూడా బస్సులు నడిపిస్తున్నాం. సిరోంచ, కాళేశ్వరం వరకు సర్వీసులు నడుస్తున్నాయి. జాతీయ రహదారి-63 నాలుగు వరుసలైంది. కాగజ్నగర్, ఆసిఫాబాద్ రోడ్డు 90 శాతం వరకు పూర్తయ్యింది. అక్కడక్కడా కొంత ఫ్లైఓవర్స్ వర్క్స్ నడుస్తున్నాయి. కార్లలో గంటలో మహారాష్ట్రలోని చంద్రాపూర్, సిరోంచ వరకు వెళ్లిపోవచ్చు. బస్సు సర్వీసు అరగంట ఆలస్యం అవుతది. ఒకప్పుడు ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యే లేదు. అరగంటకు ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఆసిఫాబాద్ డిపో నుంచి మహారాష్ట్రలోని బీజాపూర్కు ఇటీవలే ఒక సర్వీస్ ప్రారంభించారు.
– రవీంద్రనాథ్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల