కష్టపడితే సాధించలేనిదేదీ లేదనడానికి నిదర్శనం ఆయన. ఈఈఈ పూర్తి చేసి విద్యుత్ శాఖ ఏఈగా ఉద్యోగం సాధించిన ఆ యువకుడు, కలెక్టర్ ఉషారాణిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంక్ సాధించి ఆదర్శంగా నిలిచారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని.. రెండు నెలల్లోనే విభిన్నమైన పని తీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవోలకు విధులపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు స్వయంగా 25 ప్రశ్నలతో క్విజ్ పోటీలు నిర్వహించి పాపులర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ల జారీలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అతనే మంచిర్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖిలో ఇప్పటి వరకు తీసుకున్న పాలనా నిర్ణయాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మంచిర్యాల, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కష్టపడి చదివితే వరంగల్ నీట్లో బీటెక్ సీటు వచ్చింది. 2015లో ఈఈఈ పూర్తయ్యిందో లేదో.. అలా విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. 2016లో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పని చేశారు. రొటీన్ వర్క్.. రోజూ ఒ కే సమస్య. ఒకే సబ్జెక్ట్.. ఉదయం ఆఫీస్కు వెళ్లి.. సా యం త్రం ఇంటికి వచ్చాక ఆలోచిస్తే ఆ రోజు కొత్తగా చేసిందేమైనా ఉందా అంటే.. ఏమీ ఉండదు. 8వ తరగతిలో ఉండగా, అప్పటి మహబూబ్నగర్ కలెక్టర్ ఉషారాణి స్పీచ్ విని.. ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఈగా ఒకే పనికి పరిమితమయ్యాననే అసంతృప్తి నిత్యం వెంటాడేది. అందుకే గట్టిగా ప్రయత్నం చేద్దామనుకున్నారు.
ఉద్యోగానికి ఈవోఎల్ పెట్టి 2018 జూలైలో సివిల్స్కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. 2019 అక్టోబర్లో ఎగ్జామ్స్ రాశారు. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. పట్టుబడితే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు. అతనే మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బీ. రాహుల్. పోస్టింగ్ తీసుకున్న మొదటి రెండు నెలల్లోనే విభిన్నమైన ఆవిష్కరణలు, పని తీరుతో తన ప్రత్యేకతను చాటుతున్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖిలో ఆయన ఇప్పటి వరకు తీసుకున్న పాలనా నిర్ణయాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (ప్రస్తుతం నారాయణపేట్ జిల్లా). తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాన్న నర్సింహులు రిటైర్ అయ్యారు. అమ్మ శశికళ ఇంకా పని చేస్తున్నది. భార్య మనీష. అక్క పుష్యమి పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నది. వాళ్ల క్రమశిక్షణే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. వరంగల్ నీట్లో 2015లో ఈఈఈ పూర్తి చేశాను. 2016లోనే ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లో టీఎస్ఎస్పీడీసీఎల్లో రెండేళ్లు ఏఈగా పని చేశాను. తెలుగు సాహిత్యం ఆప్షనల్ తీసుకొని తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. గడిచిన 20 ఏళ్లలో తెలుగు సాహిత్యం ఆప్షనల్గా తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించిన వాళ్లు లేరని చాలా మంది నాతో చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు ఒక ప్రత్యేకత తీసుకురావాలనుకుంటున్నాం. పైలెట్గా తీసుకున్న 36 ప్రభుత్వ బడుల్లో బ్యూటీఫికేషన్ చేయ బోతున్నాం. ప్లాంటేషన్, బోర్డులు, పిల్లలు ఆడుకోడానికి చిన్న పార్క్లు ఇవన్నీ ‘మన ఊరు-మన బడి’లో చేయమని చెప్పనివి కూడా అదనంగా చేస్తున్నాం. ఈ 36 బడుల్లో ఎక్కడ దాతలు ముందుకు వస్తే.. అక్కడ చేయాలని నిర్ణయించుకున్నాం. హాజీపూర్ పర్దాన్పల్లిలో ఇప్పటికే దాతలు స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మేము సబ్బేపల్లి ఎంపీపీఎస్ను మోడల్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇంకో 20 రోజుల్లో ఆ స్కూల్ రూపురేఖలు మార్చేస్తాం. సింగరేణివాళ్ల సాయంతో ఆర్కిటెక్ను పిలిపించి స్కూల్, ఊరు పేరు వచ్చేలా ప్లాం టేషన్ చేయాలి అనుకుంటున్నాం. అక్కడ వచ్చే మార్చు ఒక నెల రోజుల తర్వాత మీరే చూస్తారు.
గ్రామాలకు వెళ్లినప్పుడు పంచాయతీ ఆఫీస్, పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డులతో పాటు స్కూళ్లకు వెళ్తున్నా. ప్రైమరీ స్కూల్కు ఫస్ట్ ప్రియారిటీ, హై స్కూల్ ఉంటే అందులో 10వ తరగతి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నా. టాంజరిన్ అని విద్యాశాఖ యాప్ ఒకటి ఉంది. దాని ద్వారా పిల్లలను ప్రశ్నలు అడుగుతున్నాం. స్వయంగా పిల్లలతో మాట్లాడడం, బోర్డు మీద లెక్కలు చేయించడంవంటివి చేస్తున్నాను. నేను వెళ్లిన స్కూళ్లలో పిల్లల పెర్పార్మెన్స్ బాగుంది అనిపించిన దగ్గర టీచర్లను అభినందిస్తూ లెటర్లు పంపించాం. తాండూరు మండలం గోపాల్నగర్, హాజీపూర్ మండలం కొత్తపల్లి టీచర్లకు ఇప్పటికే మా ఎంపీడీవోలు వెళ్లి శాలువాలతో సత్కరించి, లెటర్లు ఇచ్చి వచ్చారు. పిల్లల పెర్మార్మెన్స్ బాగుందంటే అది ముమ్మాటికీ టీచర్ల పనితీరుతోనే. అందుకే వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అభినందన పత్రాలు ఇస్తున్నాం. ఇది తెలిసి ఓ 10 మంది టీచర్లు ‘సార్.. మా పిల్లల పెర్పార్మెన్స్ కూడా బాగుంది చూడండి’ అని వీడియోలు, మెసేజ్లు పంపించారు. ఆ స్పిరిట్ నాకు చాలా బాగా నచ్చింది.
మంచిర్యాల అదనపు కలెక్టర్గా జాయిన్ అయ్యాక.. ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు ఓపీఎస్(అదర్ పంచాయతీ సెక్రటరీస్)లను కలిశాను. వారికి విధులపై అవగాహన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపించింది. అప్పటి నుంచి ఏ గ్రామానికి వెళ్లినా పంచాయతీ సెక్రటరీని పక్కన పెట్టుకొని చిన్న ప్రశ్నలు అడగడం అలవాటైంది. అలా పంచాయతీ కార్యదర్శులకు ఎంత మందికి వారు చేసే పని మీద అవగాహన ఉందో తెలుసుకోవాలి అనిపించింది. అందుకే నేను స్వయంగా 25 ప్రశ్నలు ప్రిపేర్ చేసి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలకు క్విజ్ పెట్టా. జిల్లాలోని 335 మంది ఈ పరీక్ష రాశారు.
నాకు తెలియకుండానే ఈ విషయం చాలా పాపులర్ అయిపోయింది. ఆ పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి. ఏ ప్రశ్నకు 300 మందికి మించి తప్పు సమాధానం ఇచ్చారు. ఏ ప్రశ్నకు 200 మందికి మించి తప్పు సమాధానం ఇచ్చారు. ఏ ప్రశ్నకు 100 మంది కంటే ఎక్కువ మంది తప్పు సమాధానం ఇచ్చారు.. ఇలా జాబితా తయారు చేసి వారికి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పీపీటీలు తయారు చేశాం. వచ్చే వారం నుంచి వారికి శిక్షణ కూడా ప్రారంభిస్తాం. ట్రైనింగ్ సెక్షన్ ప్రారంభించిన రోజు క్విజ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలకు ప్రశంస పత్రాలు ఇస్తాం.
సమస్య దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ -నాన్వెజ్ మార్కెట్లో కొన్ని నెలల పాటు పనులు జరగలేదు. విషయం తెలియగానే నేను ఆ కాంట్రాక్టర్లందరినీ పిలిపించుకొని మాట్లాడాను. ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో నేను వచ్చిన రోజు 130 క్రీడా ప్రాంగణాలు ఉంటే.. నేను వచ్చాక 170 క్రీడా ప్రాంగణాలను కొత్తగా ఏర్పాటు చేయించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో అనాధికారిక లే అవుట్లు ఉంటే వెంటనే వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఎవరైనా.. ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు.
అసైన్డ్ల్యాండ్స్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నాం. మంచిర్యాల చాలా మంచి జిల్లా. ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ. ఈజీగా అర్థం చేసుకుంటారు. అధికారులు చెప్పిన మాట వింటారు. పొలిటీషియన్స్ కూడా బాగున్నారు. ఏం కావాలన్న రిక్వెస్ట్గా అడిగేవారే ఎక్కువ. కలెక్టర్ భారతీ హోళ్లికేరి బాగా సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రియారిటీస్ను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఉత్తమ పనితీరు కనబరచడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
మున్సిపాలిటీలకు గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్కంటే కూడా సొంత ఆదాయం చాలా ముఖ్యం. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్వంటివి చాలా ఉంటాయి. మన వాళ్లు మార్చి వరకు టైం ఉందిగా అప్పటి వరకు చేద్దాం లే అనే ఆలోచనలో ఉన్నారు. నేను వచ్చాక రెగ్యులర్ ఫాలోఅప్తో పన్నుల వసూలు, ట్రేడ్ లైసెన్స్ల జారీ పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ ఇష్యూలో 10 శాతం వరకు ఇప్రూవ్మెంట్ తీసుకొచ్చాం. మంచిర్యాల జిల్లా వరకు ఆన్లైన్ను ప్రవేశపెట్టాం. ఇప్పటి వరకు మున్సిపల్ సిబ్బంది వెళ్లి ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని చెప్పడం. వాళ్లు దరఖాస్తు చేశాక దాన్ని మనం ఆన్లైన్ చేస్తాం.
ఆ తర్వాత వాళ్లు వచ్చి పేమెంట్ కట్టడం. చివరకు కమిషనర్ లైసెన్స్ జారీ చేయడం అంటే రెండు నుంచి మూడుసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దీన్ని పూర్తిగా మార్చేశాం. అన్ని మున్సిపాలిటీల్లో ట్రేడ్లైసెన్స్ జారీ చేసేవారికి ప్రత్యేకంగా ల్యాప్టాప్లు ఇచ్చాం. మన సిబ్బంది ముందే వెళ్లి ట్రేడ్ లైసెన్స్ కోసం వస్తాం.. దానికి కావాల్సిన డాక్యుమెంట్లు డబ్బులు రెడీ చేసుకోమని చెప్పి వస్తారు. అనంతరం సంబంధిత అధికారులు అక్కడికి వెళ్లి.. వాళ్ల ముందే కొలతలు తీసుకుంటారు. అక్కడే ఒక అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సాయంత్రం వరకు కమిషనర్ సైన్ చేసి లైసెన్స్ అప్పగిస్తారు. ఇది ఒకేసారి అయిపోతుంది. నేను నేరుగా క్యాతన్పల్లిలో చేశాను. డబుల్ రోడ్ ఉంటే స్కైర్ ఫీట్కు రూ.4, సింగిల్ రోడ్ ఉంటే స్కైర్ ఫీట్కు రూ.3 చొప్పున ట్రేడ్ లైసెన్స్ను చార్జీ తీసుకుంటున్నాం.