మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 22 : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని నాగపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘మా ఊరిలో బీజేపీ పార్టీ లేదు.. ఒకరిద్దరు మీరిచ్చే డబ్బులకు కక్కుర్తి పడేవాళ్లు మాత్రమే ఉన్నారు’ అని అడ్డుపడ్డారు. ‘మా అనుమతి లేకుండా వాట్సాప్ డీపీల్లో ఉండే ఫొటోలు తీసి బీజేపీ ఫ్లెక్సీపై ప్రింట్ చేయించారంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నాగపురం గ్రామంలో బుధవారం బీజేపీ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన వివేక్ వెంకటస్వామి, వెంకటేశ్ గౌడ్, రఘునాథ్సహా ఇతర బీజేపీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఏం ఒరగబెట్టావ్.. ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వచ్చావ్.. అంటూ నిలదీశారు. ఎన్నికల సమయం రాగానే మా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా.. అంటూ మండిపడ్డారు. సమావేశాన్ని బహిష్కరించి, వివేక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనాలు ఎవరూ మీటింగ్కు రాకపోవడంతో సహనం కోల్పోయిన వివేక్ ఎవరూ లేకుండానే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.