మంచిర్యాల : ఆర్థిక స్తోమత లేని వాళ్లకు, ఆడపిల్లలను సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివించలేని వారి కోసం ‘బాల్క ఫౌండేషన్ ’ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ ఉచిత కోచింగ్ సెంటర్లలో చదువుకోవచ్చని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. సంకశాల మల్లేశం అన్నారు.
ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ‘బాల్క ఫౌండేషన్’ వారి సహకారంతో మందమర్రి పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర ఆలయం సమీపంలో CISF బ్యారక్లో ..చెన్నూరు పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లను వీసీ మల్లేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిష్ణాతులైన ఉపాధ్యాయులతో హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లకు దీటుగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థుల కష్టం తెలిసిన వాడిగా.. ఎవరు పోటీ పరీక్షలకు దూరం కాకూడదని ఎమ్మెల్యే సుమన్ వీటిని ఏర్పాటు చేశారన్నారు.
నిరుద్యోగుకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి , ఏసీపీఎడ్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గున్నారు.