భీమారం, డిసెంబర్ 30 : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపంది. భీమారం మండలం నర్సింగాపూర్లో పెద్దపులి ఇద్దరు వ్యక్తులను పులి వెంబడించడంతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నెన్నెల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇస్లావత్ మంజునాయక్, తోడిశం దుర్గయ్య గత మూడు రోజులుగా కోటపల్లి మండలం కొండంపేటలో మామిడి చెట్లకు మందు కొట్టేందుకు వెళ్లి వస్తున్నారు.
ఇదే క్రమంలో బుధవారం సైతం ఉదయం వెళ్లి.. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుపయనమయ్యారు. భీమారంలో వంట సామగ్రి కొనుక్కొని వస్తుండగా.. నర్సింగాపూర్ శివారులోని శ్మశానవాటిక వద్దకు రాగానే.. రోడ్డు పక్కన వాహనం లైట్ వెలుతురులో పెద్దపులి కనిపించింది.
ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు బైక్ స్పీడ్ పెంచగా..పులి వెంబడించినట్లు వారు తెలిపారు. నర్సింగాపూర్ బ్రిడ్జి వద్దకు చేరుకుని వెనుకాల వస్తున్న ఆటోను చూసి ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు.