హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాంతమైన జీవనం గడుపవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి ఆర్డీవో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2020పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..18 సం. నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 31వ తేదీ వరకు రెండు/ మూడు ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాలు, మారిన చిరునామా , చనిపోయిన వారి వివరాలను తొలగించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సందర్శించి పరిశీలన చేయడంతో పాటు సెక్షన్ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేయడం జరుగుతుందన్నారు. నవంబర్ 1వ తేదీన సమీకృత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ జరుగుతుందని, నవంబర్ 30వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరిస్తామని వెల్లడించారు.
మూడు నియోజక వర్గాల పరిధిలో ఏమైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు దరఖాస్తు రూపంలో అందిస్తే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఓటరు హెల్ప్లైన్ యాప్ను రూపొందించిందని తెలిపారు. అనంతరం హెల్ప్లైన్ యాప్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లెంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, ఎన్నికల డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.