తాండూర్, మార్చి 9 : ప్రతి విద్యార్థికి చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులు లక్ష సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ సత్యసాయి దుర్గ మనోజ్ కుమార్ అన్నారు. తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువును మించిన ఆయుధం ఏదీ లేదని అందరూ విద్యను క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ శ్రద్దగా చదువుకోవాలన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి కృషి పట్టుదలతో ఎదగాలని ఏదైనా ఒక ఉద్యోగ రంగంలో స్థిర పడే వరకు లక్ష సాధనతో ముందుకెళ్లాలన్నారు. తాను చదువుకుంటున్న సమయంలోనే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో శ్రమించి విజయం సాధించానన్నారు. మళ్లీ ఇదే ప్రాంతంలో తాను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం తాను చదువుకున్న పాఠశాలలో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పదోపరీక్షల్లో బాగగా రాసి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తాండూర్ మండల విద్యాధికారి శ్రీనివాస్, కరస్పాండెంట్ సురభి ఆగమ రావు, డైరెక్టర్ శరత్ కుమార్ పాల్గొన్నారు.